హైకోర్టులో ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణను కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. ఇప్పటివరకు కోర్టు అనుమతి లేకుండా ఎన్ని కేసులు ఉపసంహరించుకున్నారో చెప్పాలని నిలదీసింది. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కేసులు ఉపసంహరించుకోవడంపై ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల అనుమతి తీసుకోవాలని చెప్పినప్పటికీ కేసులు ఎలా ఉపసంహరిస్తారని, తమ అనుమతి లేకుండా కేసులు ఉపసంహరించుకోవడం దేనికి సంకేతమని నిలదీసింది.
మేము అనుమతిచ్చిన తర్వాతే ఉపసంహరణకు సంబంధించి ప్రభుత్వం జీవోలు ఇవ్వాలి.. ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణ జీవోలను మేము కొట్టేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది.. ఇప్పుడు ఏం చేయాలో మీరే తేల్చుకోండంటూ ప్రభుత్వ న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. రెండు వారాల్లో అన్ని వివరాలను కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వ న్యాయవాది హామీ ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై కేసులను ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్లపై న్యాయవాది జడ శ్రవణ్కుమార్ తన వాదనలు వినిపించారు. తదుపరి విచారణను కోర్టు వారం రోజులపాటు వాయిదా వేసింది