రోజాతో సహా ఐదుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు: కరోనా వ్యాప్తికి వారే కారణం: కిం కర్తవ్యం..!
ఏపీలో కరోనా రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు సైతం పెరుగుతున్నాయి. కరోనా పెంపు కోసం టీడీపీ కార్యకర్తలు స్లీపర్ సెల్స్ గా పని చేస్తున్నారంటూ ఏకంగా మంత్రి మోపిదేవి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయితే, గత పది రోజులుగా పలు ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు నిబంధనలు పాటించకుండా వ్యవహరించటం వలనే ఆ ప్రాంతాల్లో కరోనా విస్తరించిందంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీని పైన విచారణకు స్వీకరించిన కోర్టు ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కరోనా వ్యాప్తికి వారే కారణమంటూ పిటీషన్ దాఖలు కావటంతో..నిబందనలు అతిక్రమించిన వారి పైన ఏం చర్యలు తీసుకున్నారో వివరించారంటూ హైకోర్టు ప్రభుత్వం..డీజీపీని ఆదేశించింది. దీంతో...ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది.
రోజాతో సహా మరో అయిదుగురికి నోటీసులు
కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల తీరు పైన పెద్ద ఎత్తున రాజకీయంగా విమర్శలు వెల్లు వెత్తాయి. నగరి ఎమ్మెల్యే..వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పైన పూల వర్షం కురిపించటం.. సోషల్ డిస్టన్స్ పాటించకుండా నిబంధనలు అతిక్రమించి కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ రోజాతో సహా మరో నలుగురి ఎమ్మెల్యేల పైన ఇంద్రనీల్ అనే న్యాయవాది ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధు సూదనరెడ్డి నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ కారణంగా ఆ పట్టణంలో ప్రభుత్వ అధికారులతో పాటుగా అనేక మంది కరోనా బారిన పడ్డారనే విమర్శలు ఉన్నాయి.
ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు విమర్శలు
పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ..చిలకలూరి పేట విడదల రజనీ..సంజీవయ్య ల పేర్లను న్యాయవాది తన పిటీషన్ లో పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి.. ఆ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి అధికార పార్టీ ఎమ్మెల్యే కారణమని పిటీషన్ లో స్పష్టం చేశారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేల తీరు పైన ప్రతిపక్ష టీడీపీ ఇప్పటి వరకు అనేక విమర్శలు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వారి తీరును తప్పుబట్టారు. రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు..ఇప్పుడు కోర్టు నుండి నోటీసులు జారీ కావటంతో.. వారు ఏ రకంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
Recommended Video
ప్రభుత్వం..డీజీపీకి కోర్టు ఆదేశాలు..
పిటీషన్ లో పేర్కొన్న అధికార పార్టీకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు...వారి పైన తీసుకున్న చర్యలను వివరిస్తూ పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ ఇచ్చింది. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా కేసు విచారించిన న్యాయస్థానం వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీతో పాటుగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయంగా వచ్చిన విమర్శలకు ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి విమర్శలు చేశారు. అయితే, చిత్తూరు జిల్లా..శ్రీకాళహస్తి ప్రాంతంలో అనూహ్యం కరోనా కేసులు పెరగటం పైన మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక, ఇప్పుడు ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లటంతో..దీని పైన రెండు పక్షాల నుండి తమ వాదనలు వినిపించనున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం..డీజీపీ దాఖలు చేసే అఫిడవిట్లు కీలకం కానున్నాయి.