జగన్కు ఏపీ హైకోర్టు భారీ షాక్- తనపై కేసుల ఉపసంహరణపై ఆగ్రహం- సుమోటో విచారణ
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేత, వైసీపీ అధినేతగా ఉన్న వైఎస్ జగన్పై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అప్పటి సర్కారు ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు వాటిని ఉపసంహరించుకుంది. దీంతో ఈ వ్యవహారంపై విపక్షాలు విమర్శలకు దిగాయి. అదే సమయంలో హైకోర్టు కూడా దీనిపై స్పందించింది. ఇలా తనపై దాఖలైన క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించుకున్న జగన్పై సుమోటో విచారణ జరపాలని హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
జగన్ టార్గెట్గా చంద్రబాబు కేసులు
గతంలో ఏపీలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం విపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్పై దాదాపు 11 క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై దురుసుగా ప్రవర్తించడం, నేరపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇలా పలు అభియోగాలు నమోదు చేసింది. వీటిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే ఎన్నికలు రావడం, టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ పగ్గాలు చేపట్టడం జరిగిపోయాయి. దీంతో ఈ కేసుల దర్యాప్తు సహజంగానే మూలనపడింది.
తనపై కేసులు ఉపసంహరించుకున్న జగన్
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తనపై పోలీసులు నమోదు చేసిన 11 క్రిమినల్ కేసులను సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఉపసంహరించుకున్నారు ఈ మేరకు డీజీపీ ఇచ్చిన నివేదికల ఆధారంగా పలు పోలీసు స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ కేసుల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో తనపై నమోదైన కేసుల విషయంలో జగన్కు క్లీన్ చిట్ లభించినట్లయింది. అయితే తనపై కేసుల్ని తానే ఉపసంహరించుకున్న వ్యవహారంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా ప్రభుత్వం స్పందించలేదు.
జగన్ కేసులపై హైకోర్టు సుమోటో విచారణ
పోలీసుల సాయంతో గతంలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల్ని సీఎం జగన్ ఉపసంహరింపజేసినా హైకోర్టు మాత్రం ఈ వ్యవహారాన్ని వదల్లేదు. ఏకంగా జగన్పై కేసుల వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. జగన్పై ప్రతిపక్ష నేతగా ఉండగా నమోదైన వివిధ క్రిమినల్ కేసుల్ని పోలీసులు, ఫిర్యాదుదారులు నిబంధనలు విరుద్ధంగా ఉపసంహరించుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
కరోనా సమయంలో పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సంబంధిత న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా హడావిడిగా వీటిని ఉపసంహరించారన్న ఫిర్యాదుల మేరకు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది దీంతో మొత్తం 11 క్రిమినల్ రివిజన్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
నేడు హైకోర్టు ముందుకు జగన్ కేసులు
సీఎం వైఎస్ జగన్ తనపై ప్రతిపక్ష నేతగా ఉండగా దాఖలైన కేసుల్ని ఏకపక్షంగా ఉపసంహరించుకోవడంపై సుమోటో విచారణ ప్రారంభించేందుకు హైకోర్టు సిద్ధమైంది. జస్టిస్ కె.లలిత నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఈ కేసుల్ని విచారించబోతోంది. ఆ కేసుల వివరాలు తీసుకున్న హైకోర్టు రిజిస్ట్రీకి నంబర్లు కూడా కేటాయించింది. దీంతో ఈ కేసుల విచారణ ఏపీ ప్రభుత్వానికీ, సీఎం జగన్కు ఇబ్బందిగా మారే అవకాశముంది. ఉపసంహరించిన మొత్తం 11 కేసుల్లో.. అనంతపురం జిల్లాకు సంబంధించినవి అయిదు, గుంటూరు జిల్లాకు సంబంధించినవి ఆరు కేసులున్నాయి.
జగన్ కేసుల్లో ప్రతివాదిగా జగన్, ఏపీ సర్కార్
వైఎస్ జగన్పై గతంలో నమోదైన క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించుకున్న వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫిర్యాదుదారులు, పోలీసులు కూడా ప్రతివాదులుగా మారారు. వీరితో పాటు సీఎం జగన్ను కూడా హైకోర్టు ప్రతివాదిగా చేర్చింది. దీంతో జగన్ కూడా సీఎం హోదాలో ఈ కేసుల్లో ప్రతివాదిగా ఉండబోతున్నారు. నిబంఘనలకు విరుద్ధంగా ఈ కేసుల ఉపసంహరణకు ఆదేశాలు ఇచ్చిన వారు, అమలు చేసిన వారు, కేసులు ఉపసంహరించిన వారందరినీ ప్రతివాదులుగా చేర్చడంతో ఈ కేసుల్లో తీర్పు ఎలా రాబోతుందన్న అంశం కూడా ఉత్కంఠ రేపుతోంది.
Recommended Video