ఏపీ మూడు రాజధానులపై నేటి నుంచి హైకోర్టు విచారణ- ఇక ప్రతి రోజూ వాదోపవాదాలు...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సవాల్ చేస్తూ హైకోర్టులో దాదాపు వంద పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇవాళ్టి నుంచి హైకోర్టు రోజువారీ విచారణ జరపబోతోంది. పిటిషన్లు దాఖలు చేసిన వారిలో అమరావతి గ్రామాల రైతులు, సామాజిక కార్యకర్తలు, విపక్ష పార్టీలు, అమరావతి ఉద్యమకారులు ఉన్నారు. వీరితో పాటు వివిద పార్టీలు కూడా తమ అభిప్రాయాలతో అఫిడవిట్లు దాఖలు చేశాయి.
మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల సంఖ్య, వాటి తీవ్రత ఆధారంగా వీటిపై రోజువారీ విచారణ జరిపేందుకు హైకోర్టు గత నెలలోనే అంగీకారం తెలిపింది. కరోనా ప్రభావం కూడా తగ్గిన నేపథ్యంలో రోజువారీ విచారణకు ఆటంకాలు కూడా ఉండబోవని అంచనా వేస్తున్నారు. ఇవాళ్టి నుంచి రోజువారీ విచారణ జరగబోతున్నందున అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే హైకోర్టు పిటిషనర్లతో పాటు ప్రతివాదులుగా ఉన్న వారికీ గతంలోనే సూచించింది. దీంతో ఆయా పార్టీలు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.
Recommended Video
మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం, గవర్నర్ సాయంతో ఆమోదించిన బిల్లులపై స్టేటస్ కో కొనసాగుతోంది. గవర్నర్ ఆమోదించిన ఈ బిల్లులు రాజ్యాంగబద్ధంగా రూపుదిద్దుకోలేదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ బిల్లుల వ్యవహారం హైకోర్టు విచారణలో కీలకంగా మారబోతోంది. దీంతో హైకోర్టు ఈ వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకోనుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రాజధానుల ఏర్పాటుకు తాను అనుకూలమని ఇప్పటికే అఫిడవిట్లు దాఖలు చేయగా.. విపక్షాలు మాత్రం తాము కొత్త రాజధానులకు వ్యతిరేకమంటూ అఫిడవిట్లు దాఖలు చేశాయి. విపక్షాలన్నీ రైతులకు మద్దతుగా నిలవడంతో ఈ వ్యవహారం చివరికి ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.