స్టేటస్ కో: అమరావతి ఎక్కడికీ తరలిపోదు: చేయాల్సిందంతా చేస్తున్నాం: కేశినేని నాని..!
అమరావతి: రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగి తీరుతుందని తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యుడు కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. దీనికి అవసరమైన అన్ని చర్యలను తాము తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) చట్టం రద్దు అంశాలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్పై విచారణ ముగిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులో గురువారం చోటు చేసుకున్న విచారణకు ఆయన హాజరయ్యారు.
రాజధాని అమరావతి, సీఆర్డీఏ రద్దు వంటి అంశాలతో ముడిపడి ఉన్న పిటీషన్లను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాససం విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది. అటు పిటీషన్లు, ఇటు ప్రభుత్వం తరఫున వాదనలను ఆలకించిన తరువాత వచ్చేనెల 26వ తేదీకి వాయిదా వేసింది.
వాదోపవాదాలు ముగిసిన అనంతరం కేశినేని నాని తనను కలిసిన విలేకరులతో ముచ్చటించారు. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో యధాతథ స్థితిని కొనసాగించాల్సి ఉంటుందని హైకోర్టు ఆదేశించినట్లు చెప్పారు. తదుపరి విచారణ కొనసాగేంత వరకూ స్టేటస్కోను విధించిందని తెలిపారు. సచివాలయాన్ని గానీ, ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడం గానీ చేయకూడదని సూచించినట్లు వెల్లడించారు.
హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురవుతుందని తాను ఆశిస్తున్నట్లు కేశినేని నాని చెప్పారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లు గానీ, సీఆర్డీఏ రద్దు గానీ చట్టవిరుద్ధమైనవని అన్నారు. న్యాయపరమైన ప్రతిబంధకాలు చాలా ఉన్నాయని, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే.. అమరావతి యథాతథంగా కొనసాగి తీరుతుందనే అభిప్రాయం కలుగుతోందని అన్నారు. సచివాలయాన్ని, విభాగాధిపతుల కార్యాలయాలను తరలించాల్సి వస్తే.. దీనికి సంబంధించిన ఖర్చులను వ్యక్తిగతంగా భరించాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు తెలిపారు.