58కి బదులు 74 మందితో భద్రత, చంద్రబాబుకు భద్రత తగ్గించలేదన్న ఏపీ సర్కార్..
అమరావతి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భద్రత రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రత తగ్గించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఇవ్వాల్సిన దాని కన్నా ఎక్కువ సెక్యూరిటీ కల్పిస్తున్నామని ఏపీ సర్కార్ బదులిచ్చింది. చంద్రబాబు భద్రతపై ఏపీ హైకోర్టులో మంగళవారం వాద, ప్రతివాదనలు జరిగాయి.
Recommended Video
వాదనలు, ప్రతివాదనలు ..
చంద్రబాబు భద్రతపై టీడీపీ నేతలు వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించింది. నిన్న టీడీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్ను కలిసి కూడా చంద్రబాబు భద్రతపై విన్నవించిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న చంద్రబాబుకు .. రాజకీయ కారణాలు చూపి సెక్యూరిటీ తగ్గించారని ఆయన తరపు న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపించారు. ఇదివరకు అలిపిరిలో జరిగిన దాడిని గుర్తుచేశారు. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబానికి కూడా భద్రత తగ్గించారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
58కి బదులు 74 మంది ..
చంద్రబాబు భద్రతపై అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏపీ సర్కార్ చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించలేదని పేర్కొన్నారు. మాజీ సీఎం హోదాలో చంద్రబాబుకు 58 మంది భద్రతా సిబ్బందిని మాత్రమే ఇవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. కానీ ఆయన సెక్యూరిటీ కోసం 74 మందిని వినియోగిస్తున్నామని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ..చంద్రబాబుకు ఎంతమందిని, ఎక్కడెక్కడ, ఏయే స్థానాల్లో భద్రత కల్పిస్తున్నామనే వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఏపీ సర్కార్ను ఆదేశించింది. అనంతరం తీర్పును వచ్చే మంగళవారానికి వాయిదావేసింది.
తప్పుదోవ పట్టించేందుకే ..
చంద్రబాబుకు భద్రత తగ్గించామనడాన్ని తప్పుపట్టారు ఏపీ హోంమంత్రి సుచరిత. చంద్రబాబుకు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని గుర్తుచేశారు. 58 మందికి బదులు 74 మందితో భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం మాత్రం వీలుకాదని స్పష్టంచేశారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే .. పరిశీలిస్తామని చెప్పారు. అయితే ప్రజావేదిక, ఇతర కూల్చివేతలను తప్పుదోవ పట్టించేందుకు భద్రత అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారని విమర్శించారు.