ప్రజాప్రతినిధులు కూడా ఎసిబి పరిధిలోకి:హోంమంత్రి చినరాజప్ప...
తూర్పుగోదావరి జిల్లా:ప్రజాప్రతినిథులను కూడా అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి తెస్తే ఎలా ఉంటుంది...జనాలు మాత్రం భలే ఉంటది అనే అనుకుంటారు... కారణం...కళ్లెదుటే ప్రజాధనాన్నిస్వాహా చేస్తూ అవినీతి,అక్రమాలతో కోట్లకు పడగలెత్తుతున్న ప్రజాప్రతినిథులను చూస్తూ నిర్వేదంలో కూరుకుపోతున్న జనాలు...ఈవిధంగా నైనా వాళ్లని కొంతైనా కట్టడి చెయ్యగలిగితే అంతే చాలని కోరుకుంటున్నారు...
మరైతే ఈ ప్రతిపాదనకు ప్రజాప్రతినిథులు ఎలా స్పందిస్తారు...తమ ఆదాయానికి గండి పడుతుందని భావించేవారెవరైనా ఎలా స్పందిస్తారో...అచ్చం అలాగే స్పందిస్తారనడంలో సందేహం ఏముంది...అయితే ఈ ప్రతిపాదన ఏ ప్రజాసంఘాల నుంచో...సామాజికవేత్తల నుంచో వస్తే ఆశ్చర్యమేమీ లేదు కాని...ఈ ప్రపోజల్ తెచ్చింది కూడా ఒక ప్రజాప్రతినిధి, అందులోను హోం మంత్రి కావడమే విశేషం...ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ చినరాజప్ప రాజమండ్రిలో ఎసిబి భవనం ప్రారంభోత్సవంలో ఈ సూచన చేశారు.
ప్రజాప్రతినిధులు కూడా...ఎసిబి పరిధిలోకి...
ప్రజా ప్రతినిదులను కూడా ఎసిబి పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉందని హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మోరంపూడిలో 94 లక్షల వ్యయంతో నిర్మించిన అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నూతన భవనాన్ని మంత్రి చినరాజప్ప ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎసిబి పనితీరు...అద్భుతం...
ఇదే క్రమంలో ప్రజా ప్రతినిధులను కూడా ఎసిబి పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎందుకంటే సమాచంలో అందరూ సమానమేనన్నారు. ఎపిలో ఎసిబి అద్భుతంగా పని చేస్తోందని అన్నారు. పెద్ద చేపలకే ఎసిబి వల వేస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో 16 కోట్ల రూపాయిల వ్యయంతో ఎసిబికి ఏడు నూతన భవనాలను నిర్మించామని ఆయన అన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఎసిబికి నూతన భవనాలు నిర్మిస్తామని ఆయన చెప్పారు.
శాంతిభద్రతలు...సిఎం ఆలోచన
అలాగే శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి జరుగుతుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు 50 మోడల్ పోలీస్ స్టేషన్లు ఎంపిక చేశారని, ఇప్పటికే 20 స్టేషన్లకు ఆధునిక టెక్నాలజీతో భవనాలను నిర్మించామన్నారు . ఉద్యోగులు సేవాభావంతో పని చేయాలని మంత్రి చినరాజప్ప అన్నారు.
ప్రజలకు కావాల్సింది ఇదే...త్వరగా చేస్తే
ఇక...ప్రజాప్రతినిధులను కూడా ఎసిబి పరిధిలోకి తేవాలన్న హో మంత్రి ప్రతిపాదనను ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతిస్తారు...మరి...తమ నియోజకవర్గాల అభివద్ది కోసం కేటాయించిన నిధులను అడ్డంగా దోచేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ప్రజాప్రతినిధులందరినీ ఎసిబి పరిథిలోకి తెచ్చి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామంటే ఎవరైనా ఎందుకు వద్దంటారు?...ఇంకా...అయ్యా...హో మంత్రిగారు అదేదో త్వరగా చేసేయండనే కోరుకుంటారు...ఊరికే ఊరించడం కాకుండా చేసి చూపించమంటారు.