భూమన గది అద్దెకు తీసుకున్నాడు: తుని ఘటనపై హోంమంత్రి చినరాజప్ప
అమరావతి: కాపుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పునరుద్ఘాటించారు. కాపులకు రుణాల మంజూరు కోసం అనంతపురంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాపు రుణమేళా కార్యక్రమంలో చినరాజప్ప పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ కాపులకు ప్రయోజనాలు చేరుకూర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందున్నారని అన్నారు. దరఖాస్తు చేసుకున్న కాపులందరికీ రుణాలు మంజూరు చేస్తామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు ఆయన తెలిపారు. కాపు ఐక్య గర్జన పేరిట తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన విధ్వంసకాండపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. తుని ఘటనకు కొద్ది రోజుల ముందే వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తునిలో ఉన్నారని అన్నారు.
తునిలో ఓ హోటల్లో గది అద్దెకు తీసుకున్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఈ ఘటన వైసిపికి చెందిన కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఉన్నట్లు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సిఐడి ప్రాథమికంగా గుర్తించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ముద్రగడతో భూమన ఓసారి స్వయంగా భేటీ కాగా, ఆ తర్వాత ఫోన్లో టచ్లో ఉన్నట్లుగా కూడా గుర్తించారని తెలుస్తోంది. కాల్ డేటా సహకారంతో నివేదిక తయారు చేశారని తెలుస్తోంది. వైసిపి భూమన కరుణాకర్ రెడ్డి ఈ సభకు ఆర్థిక సాయం చేశాడని తమ వద్ద సాక్ష్యాలున్నాయన్నారు.
కడప జిల్లా నుంచి వచ్చిన రౌడీమూకల కారణంగానే అల్లర్లు జరిగాయని, అల్లర్ల వెనుక వైసిపి పాత్ర ఉందని గతంలో పలుమార్లు ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చెప్పిన సంగతి తెలిసిందే. వైసీపీ వర్గాలు మాత్రం భూమన సౌమ్యుడని, విధ్వంసాల వైపు వెళ్లే అవకాశమే లేదని ఘంటాపథంగా చెబుతున్నారు.