బజారు మనుషుల్లా వారిద్దరూ: రామతీర్థం ఉదంతంపై హోం మంత్రి సుచరిత ఏం చెబుతున్నారు?
అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. దేవాలయాలను పరిరక్షించడానికి, దాడులను అడ్డుకోవడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొనలేకపోతోన్న చంద్రబాబు, నారా లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా దొడ్డిదారిన ఆలయాలపై దాడులకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు చోటు చేసుకోవడం వెనుక రాజకీయ కారణాలు, కుట్ర ఉందనే అనమానాలను వ్యక్తం చేశారు.
రాజకీయంగా ఉనికి కాపాడుకోవడానికి దేవుడిని సైతం వాడుకోవడానికి చంద్రబాబు వెనుకాడట్లేదని, ఇది ఆయన నీచ రాజకీయాలకు అద్దం పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాల వల్ల తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సమాధి అవుతోందని అన్నారు. రాజకీయంగా పట్టు కోల్పోతున్నామనే ఆవేదనతో చంద్రబాబు, నారా లోకేష్ చిల్లర వేషాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
బాధ్యత గల రాజకీయ నాయకులుగా కాకుండా బజారు మనుషుల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పరిరక్షించడానికి తమ శాఖాపరంగా అనేక చర్యలను తీసుకున్నామని సుచరిత వివరించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఉండే విధంగా నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అగ్ని ప్రమాదాలను నియంత్రించడానికి అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.
24 గంటల పాటు ఆలయ భద్రతను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు చర్యలు తీసుకుంటున్నారని వివరిచారు. మతసామరస్యానికి ప్రతీకైన ఏపీలో కొంతమంది ఆకతాయిలు, రాజకీయ నాయకులు ఉద్దేశపూరకంగా, మతాల మధ్య చిచ్చు పెడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అలాంటి చర్యలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపెక్షించబోమని అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు ఆలయాల్లో చోటుచేసుకున్న విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మంది అరెస్టయ్యారని తెలుస్తోంది. 11,295 ప్రాంతాల్లో 37,673 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 57,493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేశామని చెప్పారు. రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసిన కేసులో ఇప్పటికే 21 మంది అరెస్ట్ అయ్యారని సుచరిత తెలిపారు.