నారా లోకేశ్ మానభంగం చేశారంటే ఊరుకుంటారా? చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సుచరిత కౌంటర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై హోం మంత్రి సుచరిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని, నారా లోకేశ్ మానభంగం చేశారని తాము ఆరోపిస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
మరో అల్పపీడనం, భారీ వర్షాలు - సీఎం కేసీఆర్ వార్నింగ్ - వరంగల్కు మంత్రి కేటీఆర్
కుట్రలో భాగమే ఇది..
ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వైసీపీ సర్కారుపై బురద చల్లడానికే చంద్రబాబు అండ్ కో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ప్రభుత్వానికి ప్రజాదరణ పెరగకుండా చేస్తున్న కుట్రల్లో భాగంగానే ట్యాపింగ్ డ్రామా ఆడుతున్నారని హోం మంత్రి విమర్శించారు. దేశంలోనే అత్యుత్తమ మూడో ముఖ్యమంత్రి అని జగన్ కు పేరు రావడాన్ని చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని సుచరిత అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీ మనీలాండరింగ్ వ్యవహారం బయటకు వస్తుందని భయపడుతున్నారా? అని ఎద్దేవా చేశారు.
మీరేమైనా టెర్రరిస్టా?
సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదుల ఫోన్లు మాత్రమే ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని, మీరేమైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారా? ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీ బండారం బయటపడుతుందని భయపడుతున్నారా? అని చంద్రబాబును మంత్రి సుచరిత నిలదీశారు. సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్తో కలిసి మీడియాతో మాట్లాడిన హోం మంత్రి సుచరిత ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
మోదీకి లేఖపై ఆగ్రహం..
చంద్రబాబుది అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అనే నైజమని సుచరిత వ్యాఖ్యానించారు. గతంలో మోదీపై వ్యక్తిగత విమర్శలు గుప్పించిన చంద్రబాబు, ఇప్పుడు మోదీని కీర్తిస్తున్నారని దుయ్యబట్టారు. కుట్రలను ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారని... ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని తొలుత పత్రికల్లో వార్తను రాస్తారని... ఆ తర్వాత ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే డీజీపీకి ఇవ్వాలని... లేనిపక్షంలో ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
Recommended Video
చంద్రబాబు సంచలన ఆరోపణలు..
ఏపీ సర్కారు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి కొందరు ప్రైవేటు వ్యక్తులతో అక్రమంగా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, దాన్ని అరికట్టకపోతే దేశ సమగ్రతకు, భద్రతకు పెనుముప్పుగా మారుతుందని చంద్రబాబు ఆరోపించారు.ఈ మేరకు జగన్ సర్కారుపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. ప్రతిపక్ష నేతలతోపాటు న్యాయవాదులు, లాయర్లు, సోషల్ యాక్టివిస్టుల ఫోన్లను కూడా సర్కారు అక్రమంగా ట్యాప్ చేయిస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. మోదీతోపాటు కేంద్ర సమాచార, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు కూడా చంద్రబాబు లేఖను పంపారు.