రేషన్ తీసేస్తే.. రోడ్డున పడుతావ్ జాగ్రత్త!: మహిళకు చినరాజప్ప హెచ్చరిక..
స్థానిక మహిళలతో మాట్లాడుతున్న సందర్భంలో.. 'తెలివిగా మాట్లాడకు.. రేషన్ తీసేస్తే.. రోడ్డున పడుతావ్ జాగ్రత్త' అంటూ ఓ మహిళపై చినరాజప్ప మండిపడ్డారు.
పెద్దాపురం: సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపై అకారణంగా నోరు పారేసుకున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో పర్యటించిన ఆయన.. సమస్యలు విన్నవించడానికి వచ్చిన మహిళలపై ఫైర్ అయ్యారు.
స్థానిక మహిళలతో మాట్లాడుతున్న సందర్భంలో.. 'తెలివిగా మాట్లాడకు.. రేషన్ తీసేస్తే.. రోడ్డున పడుతావ్ జాగ్రత్త' అంటూ ఓ మహిళపై చినరాజప్ప మండిపడ్డారు. ప్రజల కోసం అభివృద్ధి పనులు చేస్తుంటే.. మీరు వైసీపీ గురించి ఆలోచిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ అండ చూసుకునే తనను నిలదీస్తున్నారని మంత్రి భావించినట్లు తెలుస్తోంది.
కాగా, సమయానికి వస్తే గ్రామస్తులు ఎక్కడ ప్రశ్నలు సంధిస్తారోనని, కావాలనే ఆలస్యంగా వచ్చారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మహిళలతో మంత్రి వాగ్వాదానికి సంబంధించి మరింత స్పష్టత రావాల్సి ఉంది.