అనుకుంటున్నా, ఫైనల్ కాలేదు: రాజధానిపై నారాయణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయం పైన శివరామకృష్ణన్ కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి పీ నారాయణ మంగళవారం చెప్పారు. శివరామకృష్ణన్తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన జాతీయ సంస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై చర్చిస్తున్నామని, అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
శివరామకృష్ణన్ కమిటీతో తాము కొత్త రాజధాని పైన చర్చించామన్నారు. తమ ప్రభుత్వ అభిప్రాయాలను కమిటీకి వివరించామన్నారు. 13 జిల్లాలకు అనుకూలంగా రాష్ట్ర రాజధాని ఉండాలని ఆయన అన్నారు. గుంటూరు - విజయవాడ మధ్య నీటి లభ్యత బాగుందన్నారు.
విజయవాడ ఓ పెద్ద రైల్వే జంక్షన్ అని చెప్పారు. అలాగే విజయవాడ నుండి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు రోడ్డు సదుపాయం కూడా ఉందని చెప్పారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా రాష్ట్రంలోని 13 జిల్లాలకు దగ్గరగా ఉండేలా చూడాలని కోరినట్లు చెప్పారు. నాలుగు జిల్లాలు అన్ని విధాలా అనుకూలంగా కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ జిల్లాలు అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటాయన్నారు. ఏపీకి కేటాయించిన 11 జాతీయ సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు. అనంతపురంలో ట్రిపుల్ ఐటీ, పశ్చిమ గోదావరిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం.. ఇలా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని అయితే, ఇంకా దేని పైనా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఉత్తరాంధ్రను పారిశ్రామికంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.