ఎయిర్పోర్ట్లో చంద్రబాబును తనిఖీపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఐజీ! అంతా నిబంధనల ప్రకారమే..
అమరావతి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఎయిర్పోర్టులో తనిఖీ చేయడంపై పెద్ద దుమారమే రేగింది. బాబుకు సెక్యూరిటీ చెక్ నిర్వహించడంపై మీడియాలో ఓ వర్గం గగ్గోలు పెట్టింది. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు, టీవీ ఛానెళ్లలో ప్రసారమైన కథనాలతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ ఐజీ ఈ.దామోదర్ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీ చేయడంపై జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
తెలంగాణకు మిగులు ఎంత అంటే, ఏపీపై ఏడాదికి 40 వేలకోట్ల అప్పు: జగన్ ఆందోళన
గతంలో వీఐపీ సెక్యూరిటీ ఎస్పీ
ఏపీ ఐజీగా ఉన్న దామోదర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు మూడున్నరేళ్ల పాటు వీఐపీ సెక్యూరిటీ ఎస్పీగా పనిచేశారు. ఈ క్రమంలో ఏవియేషన్ సెక్యూరిటికీ సంబంధించి ఆయనకు పూర్తి అవగాహన ఉంది. చంద్రబాబు విషయంలో జరగరానిది జరిగిపోయినట్లు ప్రచారం జరుగుతుండటంపై స్పందించిన దామోదర్ భద్రతా తనిఖీలకు సంబంధించి పలు అంశాలపై లేఖలో వివరణ ఇచ్చారు.
బీసీఏఎస్ సర్క్యులర్ ప్రకారమే
ఎయిర్పోర్టుల్లో భద్రతకు సంబంధించి ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్...ఐసీఏఓ చికాగో కన్వెన్షన్లో కొన్ని నిబంధలు, సూచనలు చేసింది. అందులో సభ్య దేశమైన భారత్లో విమానాశ్రయ భద్రతను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ..బీసీఏఎస్ చూసుకుంటుంది. చికాగో కన్వెన్షన్ నిబంధనలు, సూచనలు అమలు చేస్తున్న బీసీఏఎస్ ఈ మేరకు 36/ 2005 సర్క్యులర్ జారీ చేసింది. దాని ప్రకారం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎంలకు సైతం సెక్యూరిటీ స్క్రీనింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది.
జయలలితకు తప్పలేదు
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత పదవిలో లేనప్పుడు ఆమెను కూడా ఎయిర్పోర్టుల్లో తనిఖీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆమె పౌర విమానయాన శాఖకు ఫిర్యాదు చేయడంతో జయలలితకు సెక్యూరిటీ చెక్ నుంచి మినహాయింపు ఇచ్చారు. భారత్లో బీసీఏఎస్ తరహాలో అమెరికాలో ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్.. టీఎస్ఏ విమానాశ్రయాల్లో తనిఖీలకు సంబంధించి కొన్ని నిబంధనలు పాటిస్తోంది. వాటి ప్రకారం అగ్రరాజ్యంలో మాజీ గవర్నర్లు, మాజీ ప్రెసిడెంట్లకు సైతం బాడీ స్కానింగ్ నిర్వహించడం తప్పనిసరి. మాజీలే కాదు.. ప్రస్తుతం పదవిలో ఉన్న కేబినెట్ సెక్రటరీలు, మిలటరీ ఉన్నతాధికారులకు కూడా సెక్యూరిటీ చెకింగ్ నుంచి మినహాయింపు లేదు.
గన్నవరంలో బీసీఏఎస్ నిబంధనలు
ఎయిర్పోర్టుల్లో భద్రతను పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్, గన్నవరంలో ఎయిర్పోర్ట్లో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, కర్నాటకలోని జిందార్ విద్యానగర్ ఎయిర్పోర్టులో బళ్లారి సివిల్ పోలీసులు, ఇతర ప్రైవేటు ఏజన్సీలు బీసీఏఎస్ సర్క్యూలర్ ప్రకారం నిబంధనలు పాటిస్తున్నాయన్న విషయాన్ని ఏపీ ఐజీ దామోదర్ లేఖలో ప్రస్తావించారు. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఢిల్లీ ఎయిర్పోర్టులో ఓ అమెరికన్ ఎయిర్లైన్స్ సిబ్బంది తనిఖీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఎయిర్పోర్టు ఓనర్లకు తప్పని తనిఖీలు
సొంత ఎయిర్పోర్టులో అడుగుపెట్టేందుకు ఆయా సంస్థల ఓనర్లు, ప్రమోటర్లు కూడా సెక్యూరిటీ చెక్ తప్పదన్న విషయాన్ని దామోదర్ ప్రస్తావించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో వారు అడుగుపెట్టిన ప్రతిసారీ భద్రతా తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది నిబంధనల ప్రకారమే నడుచుకుంటోందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని దామోదర్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అధికారులను తప్పుబట్టడం సరికాదని హితవుపలికారు.