ఎపి:ఇసుక దందా...ఇక ఉండదంట:ప్రభుత్వ అధికారే అంతా పర్యవేక్షిస్తాడు!
అమరావతి:ఇసుక అక్రమ రవాణా...రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే స్థాయికి చేరిపోయింది. ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా ఈ ఇసుక దందా గురించే విమర్శల వర్షం కురిపిస్తుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు నడుబిగించింది.ఇక ఇసుక రీచ్ ల పర్యవేక్షణ ప్రభుత్వమే చేయాలని నిర్ణయించింది.
ఎలాగైనా ఇసుక అక్రమ రవాణాకు చెక్ చెప్పాలని నిర్ణయించుకున్న ఎపి ప్రభుత్వం...ఇకమీదట ఇసుక దందాకు పాల్పడేవారిపై కొరడా ఝళిపించాలని డిసైడ్ అయింది. ఈ విషయంలో అక్రమార్కులు అధికారపక్షమా?...ప్రతిపక్షమా? అనేది చూడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంకల్పించింది. ఈ క్రమంలో ఇసుక తవ్వకాలపై పెత్తనం చేయకుండా నిరోధించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
గతంలో...విధానాలు...
గతంలో కాంగ్రెస్ హయాంలో...టిడిపి ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా ఇసుక రీచ్ లను వేలంవేసి ప్రయివేట్ వ్యక్తులు తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చేవారు. అయితే ఇలా అనుమతి పొందినవారు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడటమే కాకుండా...ప్రకృతి సమతుల్యతను దారుణంగా దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఇసుకను పూర్తి ఉచితంగా ఇవ్వాలని టిడిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్వహణ డ్వాక్రా సంఘాలకు అప్పగించింది...ఈ ప్రయత్నం సఫలం కాలేదు...ఆ తరువాత మైనింగ్, రెవెన్యూ, పోలీసు ఇలా వివిధ శాఖల ఆధ్వర్యంలో, కలెక్టర్ పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు జరిగేలా చూడాలని నిర్ణయించారు. అనేక శాఖల భాగస్వామ్యంతో రీచ్లపై ఎవరికీ బాధ్యత లేకుండా పోయి ఇదీ ఫెయిలైపోయింది.
Recommended Video
ప్రతిపక్షాల...విమర్శల వర్షం
ఈ విధానంలో ఇసుక వ్యాపారంలో ప్రజాప్రతినిథులు అడ్డగోలుగా కోట్లు సంపాదిస్తున్నారని...ప్రత్యేకించి అధికార పార్టీ నేతలు ఇందులో భారీగా లబ్ధి పొందుతున్నారని ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఇటీవల కాలంలో తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఆరోపణల అస్త్రాలు అంతకంతకూ పెరిగిపోతుండంతో...ఇవి ప్రభుత్వం ప్రతిష్టను బాగా దెబ్బతీస్తున్నాయని గ్రహించిన టిడిపి ప్రభుత్వం వీటికి కళ్లెం వేసేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఇకపై ఇసుక రీచ్ల నిర్వహణా బాధ్యత మొత్తం ప్రభుత్వమే తీసుకునేలా చర్యలు చేపడుతోంది. ఇక ఇసుక రీచ్ లకు సంబంధించి ఇలా టీడీపీ ప్రభుత్వం పాలసీ మార్చుకోవడం ఇది మూడో సారి.
దళారులకు...అనుమతి లేదు
ఇకపై ఇసుక రీచ్ల్లోకి ప్రైవేటు వ్యక్తులు, దళారుల ప్రమేయాన్ని అనుమతించరాదని...ఇసుక లోడింగ్ పూర్తిగా ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణలోనే జరగాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకొంది. ఒక లారీ లేదా ట్రాక్టర్ను ఇసుకతో నింపడానికి అయ్యే ఖర్చు ఎంతో అంచనా వేసి అది మాత్రమే వసూలు చేయాలని, అలాగే ర్యాంప్ నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా అంచనా వేసి దానిని కూడా సగటున ఒక్కో వాహనానికి విభజించి అంత వరకే తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది.
తాజా నిర్ణయం...కలెక్టర్లదే కీలకం
ఇసుక దందా మీద ఇటీవలి కాలంలో విమర్శలు విపరీతంగా వస్తుండటంతో దీనిపైనా ప్రత్యేక కసరత్తు చేసిన టిడిపి ప్రభుత్వం ప్రభుత్వ పర్యవేక్షణ అనే తాజా నిర్ణయంతో ముందుకు వచ్చింది. ప్రతి రీచ్కు ఒక అధికారిని నియమించి...ఆ అధికారి ఆధ్వర్యంలోనే ఇసుక సరఫరా చేయాలని, ప్రైవేటు వ్యక్తులను వాటి వద్దకు రానీయవద్దని ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలను విజయవంతంగా అమలు చేయడంపై ప్రస్తుతం కలెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చిత్తశుద్దితో అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడటం అసాధ్యమని అనుభవజ్ఞుల మాట.