జగన్ సర్కార్ పై ఏబీ షాకింగ్- ఏ సైకో ఆనందం కోసమో ? నేను లోకల్ -ఎవర్నీ వదలను!
ఏపీలో గతంలో టీడీపీ సర్కార్ హయాంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత వైసీపీ సర్కార్ హయాంలో సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారీ ఊరటనిచ్చింది. రెండేళ్లుగా సస్పెన్షన్ లో ఉన్న ఏబీ దాన్ని ఎత్తేయాలంటూ న్యాయపోరాటం ప్రారంభించడం, హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్ధించడంతో జగన్ సర్కార్ ఇరుకునపింది. అదే సమయంలో సుప్రీం తీర్పు తర్వాత ఇవాళ ఏబీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేసారంటూ ప్రశ్నించారు.

సుప్రీం తీర్పుతో ఏబీకి ఊరట
టీడీపీ హయంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉంటూ ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొన్నారని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై రెండేళ్లకు పైగా కొనసాగుతున్న సస్పెన్షన్ ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ తీర్పు తర్వాత రిలాక్సెడ్ గా కనిపించిన ఏబీ.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు.

ఏ సైకో ఆనందం కోసం ఇదంతా?
గతంలో టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీను తన బావ కళ్లల్లో ఆనందం కోసమే ఈ హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కూడా అదే డైలాగ్ వాడుతూ..ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం ఇదందా చేశారంటూ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు.
తనకు చట్టపరంగా ఉన్న అవకాశాలు వాడుకున్నానని, తన వాదనను హైకోర్టు, సుప్రీంకోర్టు మన్నించాయని ఏబీ తెలిపారు. ఇవాళ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో ఓడిపోవడానికి కారకులెవరంటూ ఆయన ప్రశ్నించారు. ఏ సైకో ఆనందం కోసం ఇదంతా చేశారంటూ అధికారుల్ని ఆయన ప్రశ్నించారు.

నా కోర్టు ఖర్చులు ఇవ్వాల్సిందే
రాష్ట్ర ప్రభుత్వం తనపై మోపిన అభియోగాలపై కోర్టులో వాదించేందుకు సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డికి ఫీజుగా రూ.20 లక్షలు చెల్లించిందని, దీనిపై జీవో కూడా ఇచ్చారని ఏబీ తెలిపారు. ఆ తర్వాత కేసు హైకోర్టుకు చేరిందని, అక్కడా భారీగా ఖర్చుపెట్టారన, చివరికి సుప్రీంకోర్టులో ఈ కేసు వాదనల కోసం టీమ్ ను పెట్టుకుని మరీ కోట్లు ఖర్చు పెట్టారని ఏబీ ఆరోపించారు. అలాగే తనకూ కొంత ఖర్చయిందని, ప్రభుత్వం ఈ కేసులో పెట్టిన ఖర్చుకు సమానంగా తనకూ కోర్టు ఫీజు చెల్లించాలని ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. ఇదే విషయాన్ని త్వరలో ప్రభుత్వాన్ని కోరతానన్నారు.

ఆ తప్పుడు రిపోర్ట్ వల్లే సస్పెన్షన్
తన సస్పెన్షన్ కు దారి తీసిన ఘటనల్ని కూడా ఏబీ ఇవాళ ప్రస్తావించారు. ఓ డీజీపీ ఇచ్చిన ఫోర్జరీ మెమో ఆధారంగా సీఐడీ ఏడీజీ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ తోనే అప్పటి సీఎస్ ఏమీ చదవకుండా తనను 24 గంటల్లోనే సస్పెండ్ చేశారని ఏబీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తప్పుల్ని ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకోలేదన్నారు. అసలు కొనుగోలే జరగని కేసులో అవినీతి ఎలా జరుగుతుందని ఏ ఒక్కరూ ప్రశ్నించరా అంటూ ఆయన అధికారుల్ని అడిగారు.

నేను లోకల్ - ఎవర్నీ వదలను
తనను అభిమానించే వేల మందిని క్షోభపెట్టి ఏం సాధించారంటూ సస్పెన్షన్ కు కారణమైన అధికారుల్ని ఏబీ ప్రశ్నించారు. ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగం చేసే అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీసారు. ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు తెచ్చారంటూ ప్రశ్నించారు.
ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న అధికారుల్ని శిక్షించాలని, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అలాంటి అధికారుల నుంచి రికవరీ చేయాలని ఏబీ డిమాండ్ చేశారు. తన సర్వీస్ లో పది, పన్నెండు బ్యాచ్ లను చూశానని, సీఎస్ లు కూడా వస్తుంటారు, పోతుంటారని ఏబీ తెలిపారు. తాను లోకల్ అనీ, ఎవర్నీ వదిలిపెట్టబోనని ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.