చంద్రబాబు నిర్వాకం: పంట భూమి ‘ప్రైవేట్’పరం, మరీ అన్నదాత పనేంటి?
చిన్న, సన్నకారు రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు రాష్ట్రంలో పలు చర్యలు చేపట్టామని నీతి ఆయోగ్కు ఇప్పటికే ఏపీ సర్కార్ సవివరమైన నివేదిక సమర్పించింది.
హైదరాబాద్ / అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థల వ్యవసాయం అందుబాటులోకి రానున్నదండోయ్..!! తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రావనిలో చిన్న, సన్నకారు రైతులంతా తమ భూములన్నీ కార్పొరేట్ సంస్థలకు నిర్దిష్ట కాలం పాటు లీజుకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.
ఈ దిశగా భూమి లీజు చట్టం రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు రాష్ట్రంలో పలు చర్యలు చేపట్టామని నీతి ఆయోగ్కు ఇప్పటికే ఏపీ సర్కార్ సవివరమైన నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో ఇప్పటికే కాంట్రాక్టు వ్యవసాయం తరహాలో ఉండే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
అంటే ఒక గ్రామంలో గల చిన్న, సన్నకారు రైతుల భూమి అంతటినీ కార్పొరేట్ కంపెనీకి లీజుకు ఇస్తారు. ఆ కంపెనీ ఆ మొత్తం భూమిలో ఆధునిక పరిజ్ఞానంతో, మెళకువలతో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధిస్తుంది. అయితే ముందే పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయంలో.. సేద్యానికి అయ్యే ఖర్చును మినహాయించి.. మార్కెట్ ధరలకు అనుగుణంగా గానీ, తొలుత ఆయా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు వారికి డబ్బులను చెల్లిస్తుంది. తర్వాత సదరు కార్పొరేట్ కంపెనీ ఆధీనంలోకి భూమంతా వెళ్లిపోతుంది.
మెజారిటీ రాష్ట్రాలు సాగు ప్రైవేటీకరణకు వ్యతిరేకం
ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ‘పంట భూమి ప్రైవేట్ పరం' తాము అనుసరించనున్న విధానంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని రాష్ట్రాలు కూడా వ్యవసాయ రంగ ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టాలని నీతి ఆయోగ్ సూచించింది. కానీ మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు విముఖత ప్రదర్శించినట్లు సమాచారం. రైతులను వ్యవసాయానికి దూరం చేస్తారా? అని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. దేశంలో అత్యధిక శాతం చిన్న కమతాల రైతులు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని నీతి ఆయోగ్ పేర్కొన్నది. అలాంటి సన్నకారు రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తే, వ్యవసాయంలో యంత్రీకరణ పెరుగుతుందని, అన్నదాత జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
హైకోర్టు ఆక్షేపించినా వెనక్కు తగ్గిన ఏపీ సర్కార్
పంటల సేద్యం చేపట్టే కార్పొరేట్ కంపెనీలకు లాభాపేక్ష తప్ప రైతుల జీవనోపాధి మెరుగుపరిచే శ్రద్ధ, ఓపిక వాటికెందుకు ఉంటుందని రైతు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వివిధ కారణాల పేరిట రాష్ట్రంలో బలవంతపు భూసేకరణ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు వేలాది ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేసింది. రాజధాని నిర్మాణం ‘అమరావతి' నిర్మాణం కోసం మూడు పంటలు పండే భూములను ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందుకు నయానా, భయాన.. సామ, దాన, భేద దండోపాయాలన్ని ప్రయోగించిందన్న ఆరోపణలు వినిపించాయి.
రాజధాని
ఇదిలా ఉంటే రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణకు ఏపీ సర్కార్ 2013 భూసేకరణచట్టం నిబంధనలను పాటించకుండా, సామాజిక ప్రభావం ఎంత ఉంటుందని అంచనా లేకుండా రైతులనుంచి బలవంతంగా సేకరించడాన్ని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఆక్షేపించింది. మరోవైపు తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్పార్కు, భోగాపురం ఎయిర్పోర్టు, బందరు పోర్టు పేరుతో వేల ఎకరాల పంట భూములను బలవంతంగా సేకరిస్తూ... కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ప్రతిజిల్లాలోనూ లక్ష ఎకరాల ల్యాండ్ బ్యాంకు పేరుతో భూసేకరణ జరుపుతున్న ప్రభుత్వం ఇప్పుడు చిన్న, సన్నకారు రైతుల భూములపై కన్నేయడం దారుణమని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రైతుల పరిస్థితిపై ఏపీ సర్కార్ నివేదిక ఇదీ..
రాష్ట్రంలో 12.13 % వ్యవసాయ కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువనున్నాయని నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. 2004 - 05 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దేశంలో 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిందని, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పాదకతను పెంచాల్సి ఉంది. పంటలను నిల్వ చేసుకోవడం, ధర వచ్చినప్పుడే విక్రయించుకునే వెసులుబాటు లేకపోవడంతో రైతులు 2013 - 14లో రూ.1,07,994 కోట్లు నష్టపోయారు. 2004 - 05 దేశవ్యాప్తంగా వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోతున్నారు. 2004-05 లో 16.61 కోట్ల మంది రైతులు వ్యవసాయం చేస్తుండగా 2011-12 నాటికి 14.62 కోట్లకు, 2015-16 నాటికి 13.60 కోట్లకు తగ్గిపోయారు.