పోలవరంపై ఖర్చులు రాబట్టేందుకు...ఎపి ఇరిగేషన్ అధికారులు ఈ నెల 30న ఢిల్లీకి పయనం
అమరావతి:పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇవ్వాల్సిన నిధులను రాబట్టేందుకు ఈ నెల 30న రాష్ట్ర జలవనరులశాఖ అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ఇందుకోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం కోసం ఖర్చు పెట్టిన వివరాలతో కూడిన డిపిఆర్ లతో అధికారులే ఢిల్లీకి పయనం కానున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ కు ఇప్పటివరకు అయిన వ్యయానికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇదే నెలలో ఇప్పటికే రెండుసార్లు కేంద్ర జలవనరులశాఖ అధికారులకు సమర్పించింది. అయినప్పటికీ వాటి విషయమై కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం...ప్రతిస్పందన లేదు. దీంతో ఈసారి అధికారులకు డిపిఆర్ లు ఇచ్చి ఏకంగా ఢిల్లీ పంపాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు ఇరిగేషన్ అధికారులు ఈ నెల 30 న ఢిల్లీకి వెళ్లనున్నారు.
పోలవరం...అయిన ఖర్చు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 తర్వాత ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 9,389 కోట్లు ఖర్చు చేయగా అందులో కేంద్రం రూ. 6,726 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కేంద్రం చెల్లించాల్సిన మొత్తంలో ఇంకా రూ. 2,662 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ నిధుల కోసం కేంద్రాన్ని రాష్ట్ర అధికారులు పలుమార్లు కోరినా ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు.
పెండింగ్ అందుకే...కేంద్రం
ఆ నిధుల వ్యయానికి సంబంధించి లెక్కలు సరిగ్గా లేకపోవడమే అందుకు కారణమని కేంద్రం చెబుతోంది. పోలవరం ప్రాజెక్ట్ వ్యయాల గురించి సరైన సమాచారం లేదని, ఖచ్చితమైన నివేదికలు ఇస్తే నిధులు విడుదల చేస్తామని కేంద్రం మెలిక పెట్టింది. గత నెలలో పోలవరం సందర్శనకు వచ్చిన కేంద్రం జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఖర్చుకు సంబంధించిన అన్ని నివేదికలు సిడబ్ల్యుసికి సమర్పించి...వారు వాటిని క్లియర్ చేస్తే కేంద్ర ఆర్ధికశాఖ నిధులు విడుదల చేస్తుందని చెప్పారు.
గడ్కరీ హామీ...డిపిఆర్ లు
కేంద్ర మంత్రి గడ్కరీ హామీ మేరకు దీనిపై యుద్ధప్రాతిపదికన స్పందించిన రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు ఆఘమేఘాలమీద డిపిఆర్లతోపాటు, నిధులు ఏ విభాగానికి ఎంత ఖర్చుపెట్టారో ఆ వ్యయాలకు సంబంధించిన పూర్తి నివేదికను సిడబ్ల్యుసికి సమర్పించడం జరిగింది. అయినప్పటికీ కేంద్రం నిధులు విడుదలలో జాప్యం చేస్తుండటంతో విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై కేంద్రం నుంచి స్పష్టత రాబట్టాలని నిర్ణయించుకుంది.
ఆ బృందం...వచ్చేలోపే
ఈ నేపథ్యంలోనే కేంద్ర జల సంఘం బృందం ఈ నెలాఖరు కల్లా పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు సిద్ధమవడంతో ఆ బృందం వచ్చేలోపే పోలవరం ప్రాజెక్ట్ ఖర్చును రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకోసమే పోలవరం ఖర్చుపై ఒకవైపు ఫాలో అఫ్ చేస్తూ ఈలోపు నిధుల విడుదల జరిగితే సరేనని...లేని పక్షంలో డిపిఆర్ లతో రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఇఎన్సి వెంకటేశ్వరరావుతో కూడిన బృందం ఈ నెల 30 న ఢిల్లీకి బయలుదేరాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది.