'గ్రేట్ అండ్ డైనమిక్ స్టేట్ గా ఏపీ..' : సురేష్ ప్రభు సూపర్ కామెంట్
హైదరాబాద్ : ఏపీ అధికార పక్షం టీడీపీ తరుపున రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం దక్కించుకున్న సురేష్ ప్రభు ఏపీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీని డైనమిక్ స్టేట్ గా అభివర్ణించిన ఆయన ఏపీలో ఎంత వేగంగా అభివృద్ధి పరుగులు పెడుతుందో, భారత్ కూడా తదనుగుణంగా అభివృద్ధి దిశగా పయనిస్తుందని తెలిపారు.
ఇదిలా ఉంటే.. టీడీపీతో బీజేపీ సంప్రదింపులు జరపలేదని పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రకటించడం, మరోవైపు టీడీపీతో మంతనాలు కొనసాగుతున్నాయని అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలో మిత్రపక్షం నుంచి బీజేపీ రాజ్యసభ సీటుపై కొంత సందిగ్ఘం నెలకొన్న విషయం తెలిసిందే. ఇకపోతే సొంత పార్టీ శివసేన కూడా ఆయన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించలేదు.
ఇదే క్రమంలో కేంద్రంలో రైల్వే మంత్రిగా కీలక పదవి బాధ్యతలను నిర్వర్తిస్తోన్న సురేష్ ప్రభును రాజ్యసభకు పంపించాలా..! వద్దా..! అన్న మీమాంసకు తెరదించుతూ.. మొత్తానికి టీడీపీ తరుపున ఆయన నామినేషన్ ఖరారు అయింది. దీంతో హైదరాబాద్ కి చేరుకున్న ఆయన మంగళవారం అసెంబ్లీలో తన నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సురేష్ ప్రభు ఏపీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీని గ్రేట్ మరియు డైనమిక్ స్టేట్ అంటూ కితాబిచ్చిన ఆయన దేశంలో ఏపీ పాత్ర కీలకంగా ఉండబోతుందని చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి క్రుషి చేస్తామని ప్రకటించారు. అలాగే తనకు పార్టీ తరుపున రాజ్యసభ అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు సురేష్ ప్రభు కృతజ్ఞతలు తెలియజేశారు.