చంద్రబాబు...బిజినెస్ లో కాదు...ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ లో నంబర్ వన్:వైఎస్ జగన్
తూర్పుగోదావరి:ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో ఉండేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు...ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ అని వైసిపి అధినేత వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా కాకినాడలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.
Recommended Video
చంద్రబాబు పరిపాలనలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని గత రెండేళ్లలో మూడు ప్రఖ్యాత సంస్థలు...నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తేల్చి చెప్పాయన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే చంద్రబాబుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానం ఇచ్చిన వారికి బుద్ధి, జ్ఞానం ఉందా?'...అని జగన్ మండిపడ్డారు.
బాహుబలి గ్రాఫిక్స్...జగన్ ఎద్దేవా
బుధవారం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడలో పాదయాత్ర ప్రారంభించిన ఆయన.. ఆరు కిలోమీటర్లు నడిచి కాకినాడకు చేరుకున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు ఒక్క ఇటుకైనా పేర్చలేదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. కానీ సీఎం సింగపూర్ వెళ్లి.. బాహుబలి గ్రాఫిక్స్ చూపుతూ గారడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సింగపూర్లో చంద్రబాబు కోసిన కోతలు ఎలా ఉన్నాయంటే.. అమరావతిలో ఉద్యోగులు కేవలం 15 నిమిషాల్లో అలా నడుచుకుంటూ తమ కార్యాలయాలకు వెళ్లి పోవచ్చట. అక్కడ 1,400 కిలోమీటర్ల మేర సైకిళ్లు తొక్కుకునే మార్గాలున్నాయట. అమరావతి అద్భుతమైన గార్డెన్ సిటీ అట. అంతటితో ఆగలేదు. 180 కి.మీల మేర అక్కడ రవాణా కోసం కాలువలు కూడా ఉన్నాయట. అక్కడ వాడే వాహనాలన్నీ ఎలక్ట్రికల్ వాహనాలట. కాలుష్యమే ఉండదట.
చంద్రబాబు కోతలుగా...అభివర్ణన
అక్కడ చంద్రబాబు ఇలా కోతలు కోస్తే.. ఇక్కడ ఆహా... రాజధాని.. ఓహో రాజధాని.. అని ప్రచారం. నేను పొద్దున్నే లేచి చంద్రబాబు కరపత్రం ఒక పేపర్ ఏం రాసిందోనని చూశాను. ‘ఆహా... రాజధాని, ఓహో రాజధాని, అమరావతి రాజసం' అని అందులో రాశారని జగన్ ఎద్దేవా చేశారు. వాస్తవానికి అమరావతికి వెళ్లి చూస్తే అక్కడ గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అక్కడ శాశ్వత నిర్మాణం కోసం ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా వేయక పోవడం కనిపిస్తుంది. చంద్రబాబు గారి.. ఎమ్మెల్యే గారి గేదెలు గడ్డి మేస్తూ కనిపిస్తాయి. అక్కడ ఇంకా చంద్రబాబు గారి బాహుబలి గ్రాఫిక్స్ కనిపిస్తాయి. ఈయన గారి గిమ్మిక్కులు కనిపిస్తాయి. రాజధాని పేరు చెప్పి లంచాలు పుచ్చుకుని తనకు కావాల్సిన వాళ్లకు, తన బినామీలకు భూములు అమ్మేయడం కనిపిస్తోంది.
అందుకా...నంబర్ వన్
‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ పెద్దమనిషి తొలుత చేయాల్సింది ఏమంటే పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వడం...చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు రూ,6,800 కోట్లు అయితే, ఇచ్చింది కేవలం రూ.3,200 కోట్లు మాత్రమే. అంటే ఈ పెద్దమనిషి నాలుగేళ్లుగా రూ.3,600 కోట్ల రాయితీ బకాయిలు పరిశ్రమలకు ఇవ్వలేదు. ఇలాంటి వ్యక్తికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవరైనా ఇచ్చారు అంటే.. నిజంగా ఇచ్చినోడికి బుద్ధి ఉందా అన్నారు. చంద్రబాబు పాలనలో ఏ జిల్లాలో చూసినా మూతపడిన పరిశ్రమలే కనిపిస్తాయి. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు ఈ పెద్ద మనిషి ఊదరగొడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలి?...చంద్రబాబు మోసాలు, అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. ఈయనకు నంబర్ వన్ వచ్చిందని పత్రికల్లో పెద్ద పెద్ద అడ్వర్టయిజ్మెంట్లు ఇచ్చుకుని ప్రచారం చేసుకుంటున్నారని జగన్ దుయ్యబట్టారు.
ఆయన్ని...క్షమించొద్దు
"అబద్దాలాడే చంద్రబాబును మళ్లీ క్షమిస్తే...హామీలన్నీ నెరవేర్చానని, కేజీ బంగారం, బెంజికారు ఇస్తానంటారు. అయినా మీరు నమ్మరు కాబట్టి ప్రతి ఇంటికి సాధికార మిత్ర పేరుతో ఒకరిని పంపిస్తారు. వాళ్లు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. వద్దు అనద్దు...రూ.5 వేలు అడిగి తీసుకోండి. అదంతా మనడబ్బే...మన జేబుల్లోనుంచి కొట్టేసిన డబ్బే. మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. ఈ వ్యవస్థలో మార్పు కోసం మీ ముందుకు వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించండి. మన ప్రభుత్వం రాగానే పేదలందరినీ నవరత్నాలతో ఆదుకుంటాం. ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏపీపీఎస్సీ, డీఎస్సీ నోటిఫికేషన్లన్నీ క్రమం తప్పకుండా విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తాం. పెన్షన్, రేషన్ కార్డు, మరుగుదొడ్లు.. ఏది కావాలన్నా 72 గంటల్లో మంజూరు చేసే వ్యవస్థను తీసుకొస్తాం. గ్రామ సచివాలయాల్లో అక్కడి 10 మందికి ఉద్యోగాలిస్తాం. ఈ లెక్కన లక్షా యాభై వేల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం తీసుకొస్తాం''...అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
ఆ మూడు పార్టీలను...నమ్మొద్దు...
ప్రత్యేక హోదా విషయంలో ఏ పార్టీని కూడా మీరు నమ్మొద్దు...నమ్మి నమ్మి అలసిపోయాం...వద్దు వద్దంటున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి మోసం చేసింది. అందువల్ల కాంగ్రెస్ను నమ్మొద్దు. నరేంద్రమోదీ ఎన్నికలప్పుడు తిరుపతి సభలో స్వయంగా ఆయనే ప్రత్యేక హోదా ఇస్తాం, పదేళ్ల పాటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉండీ కూడా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తోంది. ఇక చంద్రబాబు.. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తాను అంటున్నారు. ఇప్పుడు 20 మంది ఎంపీలను ఇస్తే ఏం ఒరగబెట్టావ్ అని నిలదీయండి. నాలుగేళ్ల పాటు బీజేపీతో సంసారం చేసి.. ఇప్పుడు అన్యాయం చేసిందని, తాను మాత్రం మంచోడినని మోసం చేస్తున్నారు. కాబట్టి ఏపార్టీనీ నమ్మొద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వెయ్యండి. ప్రత్యేక హోదాకు ఎవరు సంతకం పెడితే వారికే మా మద్దతు. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాం. ఉద్యోగాలు రావాలి అంటే ప్రత్యేక హోదా రావాలి. ఇందుకు మీ అందరి దీవెనలు కావాలని జగన్ కోరారు.