ఏపీలో ఉంది రాక్షసరాజ్యం.. ప్రజారాజ్యం కాదు : యనమల
Recommended Video
ఏపీలోని వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వైసీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మండలి రద్దు చెయ్యాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శలు గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలే రక్షించుకోవాల్సిన అవసరం ఉందని యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ఆ పని చేయకపోతే భవిష్యత్తులో యువత నష్టపోతుందని పేర్కొన్నారు. రాజధాని అమరావతి మార్చటం కోసమే సీఎం జగన్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు యనమల .
టీడీపీ హయాంలో దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఏపీ ఉండేదని, ఇప్పుడు మన రాష్ట్రం పరిస్థితి దిగజారిపోయిందని విమర్శించారు. ఏపీ రేటింగ్ పడిపోతే పెట్టబడిదారులు ఎవరూ తమ పెట్టుబడులు ఇక్కడ పెట్టేందుకు రారని అన్నారు యనమల రామకృష్ణుడు . ఇక టీడీపీ నేతలు సైతం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే .