'అవినీతిలో ఏపీ నంబర్ వన్.. లంచం ఇవ్వందే పనికావట్లేదు!'
అవినీతి విషయంలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ సంచలన కామెంట్ చేశారు.
విశాఖపట్నం: గత కొద్దిరోజులుగా విశాఖపట్నం పేరు భూదందా వార్తల్లోనే ఎక్కువగా వినబడుతోంది. దీనిపై స్థానిక నేతలే ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. అధికారులు సైతం భూ రిజిస్ట్రేషన్ల విషయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది.
అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నోటి నుంచే ఈ ఆరోపణలు వస్తుండటం గమనార్హం. తాజాగా దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పుకొచ్చారు.
అవినీతి విషయంలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందంటూ సంచలన కామెంట్ చేశారు. భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా.. లంచం ఇవ్వనిదే పనులు జరగట్లేదని ఆరోపించారు. విశాఖలో అవినీతి అధికారులను గనుక పట్టిస్తే.. రూ.10వేల నగదుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో ఫోటో దిగే అవకాశం కల్పిస్తామన్నారు.
అవినీతి అధికారులను పట్టించే తొలి 100మందికి.. ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన్ను కలిసే అవకాశం కల్పిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో అవినీతి నిరోధక శాఖను మరింత పటిష్టం చేయాలని చెప్పారు.