దేశంలో ఏపీ ఓ ట్రెండ్ సెట్టర్.. నాలెడ్జ్ ఉన్నవాళ్లే ప్రపంచాన్ని జయిస్తారు : బాబు
విశాఖపట్నం: మేధోసంపత్తి దేశం సొత్తు అయితే ట్రెండ్ సెట్టింగ్ కు కేరాఫ్ ఏపీ అంటూ కామెంట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నాలెడ్జ్ ఉన్న వ్యక్తులే ప్రపంచాన్ని జయిస్తారని ఆయన అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా.. సీతమ్మధార వుడా కాంప్లెక్స్లో 8 ఐటీ కంపెనీలను ప్రారంభించిన అనంతరం ఐటీ కంపెనీల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం 8 ఐటీ కంపెనీల ఏర్పాటుతో పాటు మరో 32 కంపెనీలతో ఎంవోయూ ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ 11వ డెవలప్మెంట్ సెంటర్ ఏపీలోనే ఏర్పాటు కాబోతున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇన్నేవేషన్ చాప్టర్లతో పాటు, ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
విద్యార్థులు.. నిరుద్యోగులు.. ఉద్యోగాల కోసమే కాకుండా.. తామే నలుగురికీ ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. భవిష్యత్తులో ఏపీని మరో సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కంపెనీల ఏర్పాటుకు ఐటీ కంపెనీలుముందుకు వస్తే.. సకల సౌకర్యాలు కల్పిస్తామని, వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చేవారిని ప్రోత్సహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు రావాల్సిన అవసరముందని తెలిపారు.