ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు: వేతన బకాయిలు మాత్రమే కాదు: డీఏ పెంపు ఎంతో తెలుసా?
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. వేతన బకాయిలను చెల్లించబోతోంది. దీనికి అవసరమైన ఉత్తర్వులను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. వేతన బకాయిలతో పాటు పింఛన్ మొత్తాలు, ఇతర అలవెన్సులు, గౌరవ జీతాలను మంజూరు చేసింది. డిసెంబర్, జనవరి నెల వేతనాలతో కలిపి ఆ మొత్తాన్ని చెల్లించేలా ఆదేశాలను ఇచ్చింది.
సీఎం జగన్కు సుప్రీంలో భారీ ఊరట... ఆ పిటిషన్ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మార్చి, ఏప్రిల్కు సంబంధించిన వేతనాల్లో ప్రభుత్వం కోత పెట్టిన విషయం తెలిసిందే. ఆ రెండు నెలలకు సంబంధించి 50 శాతం మాత్రమే జీతబత్యాలను చెల్లించింది. పింఛన్ మొత్తం, ఇతర అలవెన్సులను కూడా సగానికి కోత పెట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారంచడానికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం క్షీణించడం వల్ల అప్పట్లో జగన్ సర్కార్.. సగం వేతనాలు, ఇతరత్రా అలవెన్సులను ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించింది.
అప్పటి నుంచీ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. తమ వేతన బకాయిలను చెల్లించడానికి నిధులు లేవంటోన్న ప్రభుత్వం.. ఇతరత్రా పథకాలకు మాత్రం ధారాళంగా ఖర్చు చేస్తోందంటూ ప్రభుత్వ ఉద్యోగులు బాహటంగానే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. వారిలో నెలకొన్న అసహనాన్ని తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వేతనాలను చెల్లించడానికి అవసరమైన ఉత్తర్వులను జారీ చేసింది. మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించిన బకాయిలను రెండు విడతలుగా చెల్లిస్తారు. డిసెంబర్లో 50 శాతం, జనవరిలో మరో 50 శాతం మొత్తాని ఇస్తారు.
Recommended Video
ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. వేతన బకాయిలు, అలవెన్సులు, పింఛన్ మొత్తాన్ని డిసెంబర్, జనవరి నెల జీతాలతో పాటు కలిపి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాగా- ఉద్యోగుల కరవు భత్యం (డీఏ) మొత్తాన్ని పెంచడానికి కూడా వైఎస్ జగన్ అంగీకరించినట్లు ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. 3.144 శాతం మేర కరవుభత్యాన్ని పెంచడానికి అంగీకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లిస్తోన్న కరవుభత్యం మొత్తం 27.248గా ఉంటోంది. దీన్ని 30.392కు పెంచడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు.