ఏపీ సర్కారుకు జూనియర్ డాక్టర్ల డెడ్ లైన్- స్పందించకుంటే రేపటి నుంచి విధుల బహిష్కరణ...
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రతీ రోజూ దాదాపు పది వేల కేసులతో ఏపీ కొత్త రికార్డుల దశగా దూసుకుపోతోంది. అయితే డిశ్చార్జ్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. కరోనా విధుల్లో డాక్టర్లు చూపుతున్న నిబద్ధతే ఇందుకు నిదర్శనం. అయితే కరోనా ప్రారంభమయ్యాక ఫ్లంట్ లైన్ వారియర్లుగా ప్రాణాలకు తెగించి రోగులను కాపాడుతున్న తమపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తోందని జూనియర్ డాక్టర్లు ఆగ్రహంగా ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ సెంటర్లలో దాదాపు 400 మందికి పైగా జూనియర్ డాక్టర్లు పనిచేస్తున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో చదువులను కూడా పక్కనబెట్టి వీరు విధుల్లో నిమగ్నం అవుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తమకు కనీస సదుపాయాలు కల్పించడం లేదని వీరు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వేతనాల పెంపుపై తమకు ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆరోపిస్తున్న వీరు, కనీసం పీపీఈ కిట్లు, బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు.
Recommended Video
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ వేతనాలకు పనిచేస్తున్న తమకు కనీస సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ రేపటి నుంచి విధుల బహిష్కరణకు జూనియర్ డాక్టర్లు సిద్ధమవుతున్నారు. ఇవాళ సాయంత్రం లోగా తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే రేపటి నుంచి కోవిడ్ విధులకు హాజరు కాబోమని వారు స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని జూడాలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.