లాక్ డౌన్ నేపధ్యంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం: వారికి 10 వేల పరిహారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ కారణంగా సముద్రంలో చేపల వేటపై నిషేధం విధించిన నేపధ్యంలో ఉపాధి లేక నష్టపోతున్న మత్స్య కార్మిక లబ్ధిదారుల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.
కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ తో చేపల వేటపై నిషేధం విధించింది సర్కార్ . ఇక ఈ కారణంగా మూడు నెలల పాటు మత్స్యకారులు ఉపాధిని కోల్పోయారు. ఇక మత్స్య కారుల పరిస్థితిని తెలుసుకున్న ఏపీ సర్కార్ వారిని ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది. వేట విరామ సాయాన్ని అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది . ఇక దీని కోసం పడవలపై పని చేస్తున్న కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. 20 రోజుల్లో వీరికి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .
మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పని చేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసిన సర్కార్ ఆ పనిలో ఉంది .
ఇక మత్స్య కారులకు గతంతో పోలిస్తే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వీరికి అందించే ఆర్ధిక సాయాన్ని రూ.10 వేలకు పెంచింది. ఇక బోట్ల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది లబ్ది దారులు కూడా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో పొందు పరిచాక వారికి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతుందని అధికారులు చెప్తున్నారు.