కరోనా : ఏపీ లేటెస్ట్ బులెటిటన్.. వెంటిలేటర్ల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక విజ్ఞప్తి
కరోనా వైరస్ వ్యాప్తిపై ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 314కి చేరినట్టు పేర్కొంది. కొత్తగా 10 కేసులు నమోదవగా.. గుంటూరులో అత్యధికంగా 8,కడప,నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కరోనా పేషెంట్లకు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వెంటిలేటర్స్ను రాష్ట్ర స్థాయి,జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లోని వెంటిలేటర్లను జిల్లా,రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రులకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సంబంధిత యాజమాన్యాలు ప్రభుత్వానికి స్వచ్చందంగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి తీసుకున్న వెంటిలేటర్ల వినియోగానికి సంబంధించి అద్దె కూడా చెల్లిస్తామని తెలిపింది. అంతేకాదు,ఆ వెంటిలేటర్లను సురక్షితంగా తిరిగిచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంది. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని చెప్పింది. వ్యాధి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ సంసిద్దతలో భాగంగా ప్రభుత్వ నిర్ణయానికి ప్రైవేట్ యాజమాన్యాలు సహకరించాలని.. తమ వద్ద ఉన్న వెంటిలేటర్లను ప్రభుత్వానికి అందజేసి సామాజిక బాధ్యతను నెరవేర్చాలని కోరింది.
Recommended Video
ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 5311 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 1018 కేసులు,తమిళనాడులో 690,ఢిల్లీలో 550,తెలంగాణలో 404 కేసులు నమోదయ్యాయి. దేశంలో పాజిటివ్ కేసుల్లో వెయ్యి మార్కు దాటిన మొదటి రాష్ట్రం మహారాష్ట్రనే కావడం గమనార్హం. వైరస్ తీవ్రత నేపథ్యంలో లాక్ డౌన్ పొడగింపుపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. బుధవారం(ఏప్రిల్ 8)న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ దీనిపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.