‘కేసీఆర్! కడుపులో పెట్టుకుంటామని దాడులు చేయిస్తారా?’
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆంధ్రవారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి?' అంటూ ఏపీ న్యాయవాదుల జేఏసీ ప్రశ్నించింది.
విజయవాడలో జేఏసీ నేతలు మాట్లాడుతూ... రాష్ట్ర విభజనకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలా మాట్లాడి ఇప్పుడు మరో తీరుని కనబరుస్తున్నారని మండిపడ్డారు. వరంగల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన న్యాయమూర్తిపై దాడి జరపడమేంటని ప్రశ్నించారు.
ప్రజలను రెచ్చగొట్టడం భావ్యం కాదని హితువు పలికారు.. హైకోర్టు విభజన జరగాలంటే ఓ పద్దతి ఉంటుందని పేర్కొన్నారు. ఏపీకి చెందిన న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తున్నామని న్యాయవాదుల జేఏసీ తెలిపింది.
ఏపీ ఉద్యోగులను అడ్డుకున్న తెలంగాణ ఉద్యోగులు
విజయవాడకు తరలిస్తున్న బీసీ వెల్ఫేర్ ఫైల్స్ లో తెలంగాణ ఫైల్స్ కూడా ఉన్నాయంటూ టీ ఉద్యోగులు ఆరోపించారు. ఏపీ ఉద్యోగులు నవ్యాంధ్రకు తరలివెళుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంక్షేమభవన్ ఉద్యోగులు గురువారం అమరావతికి బయలుదేరారు.
ఈ నేపథ్యంలో తరలిస్తున్న బీసీ వెల్ఫేర్ ఫైల్స్ను తరలించకుండా తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి ఫైళ్లను ఎలా తీసుకెళ్తారని వారు నిలదీశారు.
ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఏపీ, తెలంగాణ ఫైళ్లు విభజించాలని ఈ సందర్భంగా టీ ఉద్యోగులు డిమాండ్ చేశారు.