హైకోర్టు విభజనపై అత్యవసరానికి నో: ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘంకు సుప్రీం కోర్టులో షాక్
అమరావతి/న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లాయర్లు... సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది. హైకోర్టు విభజనపై అత్యవసర విచారణ చేపట్టాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
జనవరి 2వ తేదీన సాధారణ విచారణ చేపడతామని తెలిపింది. అమరావతి పరిధిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం పూర్తయ్యే వరకు హైదరాబాద్ నుంచి హైకోర్టు తరలింపు వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది.
పిటిషన్ స్వీకరించారు కానీ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించారు. కానీ అత్యవసర విచారణను చేపట్టలేమని తేల్చి చెప్పారు. సుప్రీం కోర్టుకు వింటర్ సెషన్స్ కొనసాగుతున్నాయని, కాబట్టి జనవరి రెండో తేదీన విచారణ చేపడతామని తెలిపింది. హైకోర్టు భవనాలు, జడ్జిల నివాస సముదాయాలు, ఇతర మౌలిక వసతులు పూర్తయ్యే వరకు హైకోర్టు విభజన వాయిదా వేయాలని ఏపీ న్యాయవాదుల సంఘం కోరింది.
తెలంగాణ కెవిటయ్
హైకోర్టు విభజన అవసరమని తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. అయితే ఏపీ న్యాయవాదుల పిటిషన్ను మాత్రం అత్యవసరంగా స్వీకరించేందుకు సుప్రీం న్యాయవాది నో చెప్పారు. దానిని తోసిపుచ్చారు. జనవరిలో సాధారణ విచారణ చేపడతామన్నారు.
హౌస్ మోషన్ పిటిషన్
అమరావతి పరిధిలో నిర్మిస్తున్న భవనం పూర్తయ్యేవరకు హైదరాబాద్ నుంచి హైకోర్టు తరలింపు నిర్ణయం వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం రిట్ పిటిషన్ను శనివారమే దాఖలు చేసింది. సుప్రీం కోర్టుకు సెలవులు కావడంతో వెకేషన్ అధికారి వద్ద శనివారం పిటిషన్ దాఖలు చేసి హౌస్ మోషన్ పిటిషన్ కింద విచారణ చేపట్టాలని ఏపీ న్యాయవాదుల సంఘం కోరింది. అయితే, ఆదివారం ఎలాంటి నిర్ణయం చెప్పలేదని, సోమవారం ఉదయం రిజిస్ట్రీని కలవాలని తమకు సమాచారం అందినట్టు సంఘం ప్రతినిధి న్యాయవాది తెలిపారు. ఆ తర్వాత సోమవారం అత్యవసర విచారణను తోసిపుచ్చింది.
ఉద్యోగులు తరలివెళ్లే క్రమంలో ఉద్విగ్న వాతావరణం
ఇదిలా ఉండగా, సోమవారం హైదరాబాద్ నుంచి హైకోర్టు ఉద్యోగులు ఏపీకి తరలి వెళ్లే క్రమంలో ఉద్విగ్న వాతావరణం కనిపించింది. హైకోర్టు జడ్జిలు సోమవారం సాయంత్రానికి అమరావతికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులలో సిబ్బంది, వస్తువుల తరలింపు ప్రక్రియ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. తెలంగాణ, ఏపీ న్యాయవాదులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.