పెన్మెత్స మృతిపై జగన్, చంద్రబాబు సంతాపం- గురుతుల్యుడ్ని కోల్పోయానన్న బొత్స..
Array
సీనియర్ రాజకీయవేత్త, వైసీపీ నేత పెన్మెత్స సాంబశివరావు మృతిపై ఏపీలో పార్టీల కతీతంగా నేతలు సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. పెన్మెత్మతో ఉన్న రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కొందరు, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ మరికొందరు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన శిష్యుడు, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా గురువు పెన్మెత్స మృతి పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నేత కూడా అయిన పెన్మెత్స మరణంపై సీఎం జగన్ కూడా సంతాపం ప్రకటించడమే కాకుండా ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.
పెన్మెత్స మృతిపై జగన్ సంతాపం...
రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి పెన్మెత్స సాంబశివరాజు మృతిపై ఏపీలో అధికార, విపక్షాల నేతలు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. సీఎం జగన్ కూడా పెన్మెత్స మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు పెన్మత్స సాంబశివరాజు గారు అని జగన్ కొనియాడారు. ఆయన మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. పెన్మత్స కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేవుడు ఆ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.
చంద్రబాబు, టీడీపీ నేతల సంతాపం..
సీనియర్ రాజకీయ వేత్త అయిన పెన్మెత్స మరణంపై విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్విట్టర్లో సంతాపం వ్యక్తం చేశారు.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా, విలువలకు మారుపేరుగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న పెన్మత్స సాంబశివరాజు గారి మరణం విచారకరం, రాష్ట్ర రాజకీయాలకు తీరనిలోటు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. టీడీపీకి చెందిన పలువురు నేతలు కూడా పెన్మెత్మ మృతిపై తమ సంతాపం తెలిపారు. అటు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు పెన్మెత్స మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
శిష్యుడు బొత్స సంతాపం...
తనకు రాజకీయాల్లో అరంగేట్రం చేయించిన గురువు, మాజీ మంత్రి , సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని, ఎందరికో ఆదర్శప్రాయులైన సాంబశివరాజు గారి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని సేవలను స్మరించుకున్నారు. సాంబశివరాజు గారి అడుగుజాడల్లో పని చేసి ఎన్నో విషయాలను నేర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బొత్స ఓ ప్రకటనలో తెలిపారు.
అధికారికంగా అంత్యక్రియలు..
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత పెన్మత్స సాంబశివరాజు పార్ధివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలనిఅధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చారు. రేపు ఆయన సొంత జిల్లా విజయనగరంలో పెన్మెత్స అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు జిల్లా అధికారులకు సీఎంవో నుంచి అదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.