ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ- అచ్చెన్నాయుడు, రామానాయుడుకు నోటీసులు
ఏపీ అసెంబ్లీ గత సమావేశాల్లో చోటు చేసుకున్న రెండు సంఘటనల్లో ప్రభుత్వం, స్పీకర్పై అనుచితంగా వ్యవహరించిన ఆరోపణలపై ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల భవితవ్యం తేల్చేందుకు సభా హక్కుల కమిటీ ఇవాళ భేటీ అయింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశమైంది. ఏడుగురు సభ్యుల కమిటీ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై చర్చించింది.
గత అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు అనుచితంగా ప్రవర్తించినట్లు నిర్దారణకు వచ్చిన ప్రభుత్వం వీరిద్దరిపై సభా హక్కుల కింద చర్యలు తీసుకోవాలని అప్పట్లో నోటీసులు ఇచ్చింది. దీని ఆధారంగా ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల సభా హక్కుల కమిటీ తొలిసారి సమావేశమైంది. కమిటీలో కాకాణితో పాటు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, అప్పలనాయుడు, వర ప్రసాద్, కన్నబాబు,చక్రపాణి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. ఈ భేటీలో ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరగింది.
ఈ నెల మొదటి వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల పంపిణీ, రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఉద్దేశ్య పూర్వకంగా సభను తప్పుదారి పట్టించేలా వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై సీఎం జగన్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఇక నిమ్మల రామానాయుడుతో పాటు మరొక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపైనా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి నిమ్మల రామానాయుడు పరుష పదజాలం ఉపయోగించడంతో పాటు స్పీకర్ స్ధానాన్ని అవమానించేలా వ్యవహరించారని, సభా నియమాలను ఉల్లఘించడంతో పాటు సభను గందరగోళానికి గురిచేసిందుకు ప్రయత్నించారనే అంశాలపై కమిటీ చర్చించింది.
ప్రివిలేజ్ కమిటీ సమావేశం అనంతరం మాట్లాడిన ఛైర్మన్ కాకాణి గోవర్ధన్రెడ్డి.. ప్రతీ శాసనసభ్యుడి హక్కులను కాపాడేందుకు తాము పనిచేస్తామన్నారు. స్పీకర్ రిఫర్ చేసిన వాటిని కూడా పరిశీలించి చర్చించినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన తర్వాత వారి వివరణ తీసుకుని చర్యలు చేపట్టనున్నట్లు కాకాణి తెలిపారు. సభలో తీర్మానం ఆమోదించిన అంశాలపైనే తాము చర్చించామన్నారు.