ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ - నోటిఫికేషన్ జారీ- ఐదురోజులు జరిగే అవకాశం
ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరుతో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఇవాళ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం ఈ నెల 30న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశాన్ని అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించనుంది.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 30వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశాన్ని బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి అసెంబ్లీని ఐదురోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పలు కీలక అంశాలు పెండింగ్లో ఉన్నప్పటికీ కరోనా, ఇతర పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని ఐదురోజుల అసెంబ్లీ వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
ఈసారి శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. ఇందులో దిశ చట్టం సవరణ ముసాయిదా బిల్లుతో పాటు పలు బిల్లులు ఉన్నాయి. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపైనా అసెంబ్లీ తీర్మానం చేసే అవకాశముంది. రేపటి కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటు కోర్టు పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి కూడా సీఎం జగన్ ఓ ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి. కరోనా కారణంగా గతంలో ఆగస్టులో సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం పలు బిల్లులతో పాటు కీలక అంశాలు పెండింగ్లో ఉండటంతో శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కూడా తగ్గుముఖం పట్టడంతో ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశాలకు పూర్తి స్ధాయిలో హాజరయ్యే అవకాశాలున్నాయి.