మూడు రాజధానులపై మరో మలుపు..సెలెక్ట్ కమిటీలపై బీజేపీ, పీడీఎఫ్ లేఖలు..ఇరకాటంలో జగన్ సర్కారు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్, అమరావతిలో లెజిస్లేటివ్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటళ్ల ఏర్పాటుకు సంబంధించిన 'ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ' బిల్లుతోపాటు సీఆర్డీఏ రద్దు బిల్లుపై.. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదిలింది. కమిటీల ఏర్పాటుపై జగన్ సర్కారు భిన్నవాదనలు వినిపిస్తోన్నవేళ.. ప్రతిపక్ష బీజేపీ, పీడీఎఫ్ సోమవారం లేఖలు పంపి సంచలనం రేపాయి.
వైసీపీకి షాకిస్తూ..
మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లుల్ని శాసన మండలి అడ్డుకోవడం.. ఆ రెండు బిల్లుల్ని సెలెక్ట్ కమిటీ పరిశీలకు పంపుతామని చైర్మన్ షరీఫ్ ప్రకటించడం.. ఆ చర్యను తప్పుపడుతూ జగన్ సర్కారు ఏకంగా మండలినే రద్దు చేయడం తెలిసిందే. అయితే మండలి రద్దుకు పార్లమెంట్ లో ఆమోదం లభించేదాకా వేచిచూసే ధోరణి అవలంభించాలని వైసీపీ భావిస్తుండగా.. ఈ లోపే ఏడుగురు ఎమ్మెల్సీలున్న పీడీఎఫ్, ఇద్దరు ఎమ్మెల్సీలున్న బీజేపీ సర్కారుకు షాకిస్తూ చైర్మన్ కు లేఖలు రాశాయి.
సీఎం బెదిరింపులతో లేఖలు ఆలస్యం..
శాసన మండలి అధికారులను సీఎం జగన్, ఆయన మంత్రులు బెదిరించడం వల్లే పార్టీలకు లేఖలు పంపే ప్రక్రియ ఆలస్యమవుతున్నదని, తద్వారా కమిటీల ఏర్పాటును అడ్డుకోవాలన్నది అధికార పార్టీ కుట్రగా కనిపిస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. అసెంబ్లీ వాయిదాపడిన వారం రోజుల తర్వాత బీజేపీ, పీడీఎప్ లేఖలతో మండలి రాజకీయం మళ్లీ తెరపైకొచ్చింది.
ఏముందా లేఖల్లో..
ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీలు ఏర్పాటవుతాయన్న మండలి చైర్మన్ ప్రకటన నేపథ్యంలో బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మాధవ్, సోము వీర్రాజు చెరో కమిటీలో సభ్యులుగా ఉంటారని ఏపీ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ చైర్మన్ కు లేఖ రాసింది. అలాగే పీడీఎఫ్ తరఫున కేఎస్ లక్షణరావు, ఇళ్ల వెంకటేశ్వరావు చెరో కమిటీలో మెంబర్లుగా ఉండాలనుకుంటున్నట్లు ఫ్రంట్ తరఫున మరో లేఖ పంపారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గతంలోనే సభ్యుల పేర్లు సూచిస్తూ చైర్మన్ కు లేఖలు రాసింది. వీటిపై చైర్మన్ షరీఫ్ స్పందించాల్సిఉంది.
మండలి రద్దు కాదు..
అసెంబ్లీ తీర్మానంతో మండలి రద్దు కాదని, పార్లమెంట్ ఆమోదం పొందేదాకా కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయని, ఆ క్రమంలోనే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులపై సెలెక్ట్ కమిటీలు కూడా రూపుదిద్దుకుంటాయని టీడీపీ మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. కొంత డోలాయమాన పరిస్థితి తర్వాత ఇప్పుడు బీజేపీ, పీడీఎఫ్ కూడా మండలి కొనసాగింపుకే అనుకూలమనే అర్థం వచ్చేలా కమిటీలకు పేర్లు పంపడం చర్చనీయాంశమైంది.
రాజ్యాంగ విరుద్ధం..
అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లుల్ని సెలెక్ట్ కమిటీలకు పంపే అధికారం శాసన మండలికి లేదని, పైగా, మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసిన తర్వాత కూడా కార్యకలాపాలు సాగించడం, కమిటీల ఏర్పాటుకు ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని అధికార వైసీపీ నేతలు వాదిస్తున్నారు. మండలి అధికారుల్ని బెదిరించి, పార్టీలకు లేఖలు వెళ్లకుండా చేశారన్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రులు కూడా తెలిపారు.