మండలిలో నెగ్గిన రూల్ 71 తీర్మానం.. టీడీపీకి షాక్ ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్సీలు
Recommended Video
ఏపీ శాసనమండలిలో రూల్ 71 తీర్మానానికి ఆమోదం లభించింది. అయితే ఓటింగ్ సందర్భంగా టీడీపీకి షాక్ తగిలింది. రూల్ 71పై మండలిలో జరిగిన ఓటింగ్లో ఇద్దరు సొంత టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు శత్రుచర్ల, శమంతకమణి సభకు గైర్హాజరయ్యారు. ఇక డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో 32 మంది సభ్యుల బలం ఉన్న మండలిలో టీడీపీకి తరుపున 27 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు.
మొత్తంగా రూల్ 71కి మద్దతుగా 27 మంది ఓటేయగా.. 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 9 మంది తటస్థంగా ఉన్నారు. ఓటింగ్ తర్వాత మండలి సమావేశాన్ని ఛైర్మన్ ఫరూక్ బుధవారానికి వాయిదా వేశారు. సీఆర్డీఏ రద్దు,ఏపీ అభివృద్ది వికేంద్రీకరణలపై బుధవారం మండలిలో చర్చ జరగనుంది.
కాగా,ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి మండలిలో వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును మండలిలో వ్యతిరేకించేందుకు టీడీపీ రూల్ 71ని ప్రతిపాదించింది. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపడంతో ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం టీడీపీకి దక్కింది. అంతా భావిస్తున్నట్టుగా బుధవారం మండలిలో వికేంద్రీకరణ బిల్లు వీగిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ ఆ తర్వాత ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మండలిని రద్దు చేసే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. అది కేవలం బెదిరింపు ధోరణే అని టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
ఇకపోతే నిబంధనల ప్రకారం.. ఒకవేళ మండలిలో బిల్లు తిరస్కరణకు గురైతే తిరిగి అసెంబ్లీకే వెళ్తుంది. అక్కడ రెండోసారి అదే బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తే తిరిగి మండలికి వెళ్తుంది. మండలిలో రెండోసారి కూడా తిరస్కరణకు గురైనా.. అసెంబ్లీ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. దారి ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టుగానే పరిగణిస్తారు. గవర్నర్ ఆమోదం తర్వాత అది చట్టంగా మారుతుంది.