మళ్లీ జగన్కు మండలి చికాకు మొదలు- మున్సిపల్ బిల్లు తిరస్కరణ- నెక్ట్ ప్లాన్ ఏంటి ?
గతేడాది ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి అసెంబ్లీలో 151 మంది సభ్యులున్నారు. వీరికి తోడు టీడీపీ నుంచి ఫిరాయించిన నలుగురు కూడా ఉన్నారు. దీంతో అసెంబ్లీలో ప్రభుత్వానికి కీలక బిల్లుల విషయంలో ఎదురేలేకుండా పోతోంది. కానీ మండలిలో పరిస్ధితి వేరు. అక్కడ మెజారిటీకి ఆమడ దూరంలో ఉన్న వైసీపీని విపక్ష టీడీపీ ముప్పతిప్పలు పెడుతోంది.
ఈ ఏడాది జనవరిలో మూడు రాజధానుల ప్రక్రియకు ముందే మొదలైన ఈ అడ్డంకులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో మధ్యలో మండలి రద్దుకు ప్రతిపాదించినా దీర్ఘకాలంలో మెజారిటీ వచ్చే అవకాశం ఉండటంతో ఆ ప్రతిపాదనపై వైసీపీ మౌనం పాటిస్తోంది. అదే ఇప్పుడు వైసీపీకి ఇబ్బందులు సృష్టిస్తోంది.
మండలిలో వైసీపీకి చుక్కలు...
58 మంది సభ్యులున్న ఏపీ శాసనమండలిలో వైసీపీకి ఉన్న బలం 11 మంది మాత్రమే. కానీ విపక్ష టీడీపీకి దాదాపు 30 మంది వరకూ ఉన్నారు. దీంతో వైసీపీ కీలక బిల్లులను నెగ్గించుకునే విషయంలో అపసోపాలు పడుతోంది. ఈ ఏడాది జనవరిలో కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఓసారి అడ్డుకుని సెలక్ట్ కమిటీకి పంపిన మండలి, ఆ తర్వాత రెండోసారి విజయవంతంగా అసలు చర్చకే రాకుండా అడ్డుకోగలిగింది. ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ విభజన బిల్లులను కూడా ఇదే తరహాలో మండలి అడ్డుకుంది. ఇప్పుడు తాజాగా పురపాలక చట్ట సవరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కూడా టీడీపీ ఇతర విపక్షాలతో కలిసి అడ్డుకుంది.
అసెంబ్లీకి భిన్నంగా.. ఆసక్తికరంగా మండలి...
ఓవైపు ఏపీ అసెంబ్లీలో కార్యకలాపాలన్నీ ఏకపక్షంగా సాగిపోతుంటే పెద్దల సభ అయిన శాసనమండలిలో మాత్రం పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఓ రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో వైసీపీ ఆధిపత్యం చెలాయిస్తుంటే మండలిలో విపక్షాలు ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. అదీ ఎప్పటికప్పుడు విపక్షాలదే పైచేయి అవుతోంది. దీంతో కీలక బిల్లులు నెగ్గించుకునేందుకు విపక్షాలను తప్పనిసరిగా ఒప్పించాల్సిన పరిస్ధితి అధికార పక్షానిది. కానీ ఓవైపు అసెంబ్లీలో టీడీపీని ముప్పతిప్పలు పెడుతూ మండలిలో మద్దతు కోరితే ఇచ్చేందుకు ఆ పార్టీ కూడా సిద్దంగా లేదు. దీంతో వైసీపీకి మండలి పీడకలగా మారిపోతోంది.
అటకెక్కిన మండలి రద్దు ప్రతిపాదన
ఈ ఏడాది జనవరిలో అసెంబ్లీ అభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదనే కారణంగా శాసనమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం చేసి పంపింది. అది ఇప్పటివరకూ ఎక్కడ వరకూ వచ్చిందో తెలియదు. వరుసగా పార్లమెంటు సమావేశాలు జరిగినా ఏపీ మండలి రద్దుకు సంబంధించిన ప్రతిపాదన ఏమైందో ఎవరికీ తెలియకుండా పోయింది. వాస్తవానికి మండలి రద్దు ప్రతిపాదన పంపిన వైసీపీ సర్కారు కొద్ది నెలల వ్యవధిలోనే ఖాళీ అయిన ఓ ఎమ్మెల్సీ స్దానానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ను ఏకగ్రీవం చేసుకుంది. ఆ తర్వాత కూడా ఎమ్మెల్సీల ఎంపిక కొనసాగింది. గవర్నర్ కోటాలో సైతం ఇద్దరు ఎమ్మెల్సీలు ఎంపికయ్యారు. ఇదంతా చూస్తుంటే మండలి రద్దుపై వైసీపీ సీరియస్గా లేదని అర్ధమవుతోంది.
Recommended Video
మండలిలో మెజారిటీకి వైసీపీ ఎదురుచూపులు..
ఏపీ శాసనమండలిలో వైసీపీకి మెజారిటీ రావాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్ తర్వాతే సాధ్యం. అప్పటి వరకూ ప్రస్తుతం ఉన్న 11 మంది ఎమ్మెల్సీలతోనే నెట్టుకు రావాల్సిన పరిస్దితి. దీంతో వైసీపీ ప్రభుత్వానికి మండలిలో చుక్కలు కనిపిస్తున్నాయి. కీలక బిల్లులు ఎక్కువగా పెండింగ్లో ఉండటం, ప్రతీ దానిపైనా అసెంబ్లీకి భిన్నంగా పూర్తిస్దాయిలో చర్చించి ఆమోదించాల్సిన పరిస్ధితి ఉండటంతో వైసీపీ మంత్రులు తొందరపడేందుకు కూడా అవకాశం దొరకడం లేదు. దీంతో అసెంబ్లీని ఎక్కువ రోజులు నిర్వహించలేక, అటు ఉన్న సమయంలోనే బిల్లులు ఆమోదించుకోలేక వైసీపీ అపసోపాలు పడుతోంది. అంతిమంగా మనకు మెజారిటీ ఎప్పుడొస్తుందో అని వైసీపీ ఎదురుచూడక తప్పని పరిస్ధితి మండలిలో కనిపిస్తోంది.