కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ .. శ్రీశైలం వద్ద వరద జలాల మళ్లింపుపై ; ఆసక్తికర అంశం ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ నీటి వినియోగంపై తెలంగాణ, తెలంగాణ నీటి వినియోగంపై ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు, కేంద్ర జల శక్తి శాఖకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వరుస లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీశైలం కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతివ్వాలని లేఖలు రాసిన ఏపీ ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా మరో మారు లేఖ రాసింది.
శ్రీశైలం జలాశయం నుండి నీటి మళ్ళింపుకు అనుమతి కోరుతూ లేఖ
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోందని, నీటిని మళ్లించవలసిన అవసరం ఉందని, ఒకవేళ అలా మళ్ళించకపోతే దిగువ ప్రాంతాలలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని లేఖ రాశారు. కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి రాసిన లేఖలో వరదల కారణంగా కృష్ణా నది జలాశయాలన్నీ పొంగిపొర్లుతున్నాయని, గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వరద నియంత్రణలో భాగంగా ఇక ఈ నీటిని శ్రీశైలం జలాశయం నుంచి మళ్ళించకపోతే పులిచింతల, ప్రకాశం బ్యారేజీ కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
దిగువకు విడుదల చేస్తే ఆస్తినష్టం , ప్రాణ నష్టం జరిగే ఛాన్స్
వరద నీటిని దిగువకు విడుదల చేస్తే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అందుకే ఎగువనే వివిధ మార్గాల ద్వారా నీటిని మళ్ళించేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇలా మళ్లించిన నీటిని కేవలం వరద జలాల మళ్లింపుగా మాత్రమే చూడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ మళ్లింపు ఏ విధంగానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాలో భాగంగా పరిగణనలోకి తీసుకోకూడదని పేర్కొన్న ఆయన నీటి మళ్లింపు చేయకుంటే దిగువ ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, ప్రకృతి విపత్తుల నిర్వహణలో భాగంగా రాష్ట్రాలకు నిర్ణయం తీసుకునే బాధ్యత ఉందని, ఈ మేరకు బోర్డు సలహాలు, సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు.
కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని లేఖ
ఇదే సమయంలో శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి జల విద్యుత్ ఉత్పత్తి కూడా అనుమతికి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టం 85 ( 7) పేరా 6 ప్రకారం ప్రకృతి విపత్తుల నిర్వహణలో భాగంగా రాష్ట్రాలు నిర్వర్తించే బాధ్యతకు సంబంధించి బోర్డుల సలహాలు సూచనలు అందిస్తాయని, బోర్డులకు తమ ఆదేశాలు అమలు చేసేలా విస్తృత అధికారాలు కూడా ఉన్నాయని లేఖ ద్వారా గుర్తు చేశారు. ఇక రెండు రాష్ట్రాలు వరదల సమయంలో నీటి విడుదల, డ్యాం ల నిర్వహణ, జల విద్యుత్ కేంద్రాల నిర్వహణ విషయంలో బోర్డుల ఆదేశాలను ఇరు రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుందని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు.
నీరు వృధాగా పోకుండా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
ఇప్పటికే ఓ మారు కృష్ణా నదిలో శ్రీశైలం జలాశయం వద్ద కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి విద్యుత్ ఉత్పత్తికి ఏపీకి అనుమతివ్వాలని కోరిన అధికారులు ఇప్పటికే ఒకసారి లేఖ రాసిన విషయం తెలిసిందే . ఇప్పుడు మరోమారు విద్యుత్ ఉత్పత్తికి ఆమోదం తెలపాలని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం నిండి ఉండటంతో నీరు వృధాగా పోతుందని, ఆ నీరు వృధా కాకుండా ఉండేలా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. ప్రస్తుతం కృష్ణానదిపై జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని జలాశయాలు పూర్తి నీటి మట్టంతో ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఎగువన ఉన్న నీటిని వివిధ మార్గాల ద్వారా మళ్లిస్తే, దిగువన నీరు వృధాగా పోకుండా, దిగువ ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉంటుందని ఏపీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దృష్టికి తీసుకు వెళ్ళింది.
గతంలోనూ నీటి మళ్లింపులు చేశామని లేఖలో వివరణ
గతంలోనూ ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఎగువన వివిధ మార్గాల ద్వారా నీటిని మళ్ళింపు చేశామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లారు ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి. ఇదిలా ఉంటే ఓ వైపు భారీ వర్షాలతో మరోవైపు ఎగువ నుండి వస్తున్న వరదలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది . కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. కృష్ణానదిపై ఉన్న బహుళార్థసాధక ప్రాజెక్టు శ్రీశైలం 7 గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 2,04, 279 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. 2,54,758 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు .
శ్రీశైలం ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద .. నిండు కుండలా శ్రీశైలం జలాశయం
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.3637గా నీటి నిల్వ కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 590 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద కూడా గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యాం అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది.