ఏపీ స్థానిక ఎన్నికలు రద్దు..? ఒకే అంశంతో 2 ఆర్డినెన్సులా, నిమ్మగడ్డే కీలకం, సుప్రీం ఏం చెప్పిందంటే..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తంగా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకే అంశంతో రెండు ఆర్డినెన్సులు జారీచేయడంతో ఇబ్బంది ఏర్పడింది. ఇలాంటి అంశంపై సుప్రీంకోర్టు కూడా ఇదివరకే స్పష్టంచేసింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఆర్డినెన్సులపై ఏ విధంగా స్పందిస్తారు.. ఎన్నికల ప్రక్రియ మొత్తంగా రద్దవుతుందని ప్రకటిస్తారనే అంశం హై టెన్షన్ పుట్టిస్తోంది. కరోనా నేపథ్యంలో ఏపీలో స్థానిక ఎన్నికలను ఎస్ఈసీ వాయిదా వేయగా.. ఆయనను తొలగించేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్డినెన్సులు కూడా జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టుకు చేరడంతో.. చివరికీ వ్యవస్థలే విజయం సాధించడంతో.. ఆయన ఇటీవలే తిరిగి బాధ్యతలు కూడా చేపట్టారు. కానీ ఎన్నికల నిర్వహణపై మాత్రం పీఠముడి నెలకొంది.
జగన్ సర్కారుపై నిమ్మగడ్డ ఆశాభావం - ఆసక్తికర వ్యాఖ్యలు - ఎస్ఈసీగా తిరిగి బాధ్యతల్లోకి..
ఆర్డినెన్స్ నంబర్ 2..
స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 19న ఆర్డినెన్స్ నంబరు 2 జారీ చేసింది. ఇందులో కీలక అంశాలను చేర్చడంతో.. విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఎన్నికల ప్రక్రియను 15 రోజులకు కుదించడంతోపాటు నగదు, మద్యం పంపిణీ చేసినట్టు ఆధారాలతో సహా రుజువైతే ఐదేళ్లలో సదరు అభ్యర్థి ఎన్నికను రద్దు చేయవచ్చంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ 2కు అనుగుణంగా ఎస్ఈసీ రమేశ్ కుమార్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ఆరంభం కాలేదు. కానీ కరోనా వైరస్ వల్ల ఎన్నికలను ఎస్ఈసీ వాయిదా వేశారు. దీంతో ఎస్ఈసీ వర్సెస్ ఏపీ సర్కార్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఆరునెలల్లో ఆమోదం తప్పనిసరి..
ఏదైనా ఒక ఆర్డినెన్స్ కాల పరిమితి ఆరు నెలలు.. ఈ లోగా అసెంబ్లీ సమావేశమైతే.. మొదటి రోజు నుంచి ఆరు వారాల్లోపు ఆర్డినెన్స్ ఆమోదం పొందాలి. లేదంటే ఆ ఆర్డినెన్స్ కాలం చెల్లిపోతోంది. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి స్థానిక ఎన్నికల ఆర్డినెన్స్ అమలులోకి రాగా.. ఆగస్ట్ 20వ తేదీతో ముగియనుంది. అయితే జూన్ 16న అసెంబ్లీ సమావేశమైన సందర్భంలో శాసనసభలో బిల్లుగా ఆమోదం పొందింది. కానీ మండలిలో మాత్రం ప్రవేశపెట్టనేలేదు. అప్పుడు ప్రభుత్వం వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై మాత్రం ఫోకస్ చేసింది. కీలకమైన పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ని మండలిలో ఆమోదింపచేసుకోవాలని మాత్రం అనుకోలేదు. దీంతో ఆ ఆర్డినెన్స్ కాలం 20వ తేదీన చెల్లిపోనుంది.
వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై ఫోకస్..
అసెంబ్లీ ప్రారంభమైన తేదీ నుంచి 6 వారాల్లో ఆర్డినెన్స్ ఆమోదం పొందాలి.. కానీ ఆ గడువు జూలై నెల 27నే దాటిపోయింది. కానీ అధికారులు మంగళవారం ఆర్డినెన్స్ నంబరు 6ను జారీ చేశారు. ఆర్డినెన్స్ నంబర్ 2 జూలై 27తో కాలం చెల్లిందని అంటూనే ఇదివరకు జారీచేసిన ఆర్డినెన్స్ ఇంకా అమలులో ఉన్నదని పేర్కొంటూ కొత్తగా మరో ఆర్డినెన్స్ జారీ చేశారు. వాస్తవానికి పాత ఆర్డినెన్స్ మురిగిపోయిందని అంగీకరిస్తూనే మరోటి జారీచేశారు. ఫిబ్రవరి 20న జారీచేసిన ఆర్డినెన్స్ ఉంటుందని కొత్త ఆర్డినెన్స్ చూసినా... దాని గడువు ఈ నెల 20తో ముగిసిపోనుంది. అంటే 15 రోజుల్లో స్థానిక ఎన్నికలను నిర్వహించాలి. కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. పాత ఆర్డినెన్స్ ఆధారంగా జారీచేసిన నోటిఫికేషన్ చెల్లదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియ రద్దయినట్టేనని చెబుతున్నారు.
నిమ్మగడ్డ ఏం చేస్తారు..?
నోటిఫికేషన్కు ఆధారమైన ఆర్డినెన్స్కు కాలం చెల్లిపోవడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. కానీ పాత నోటిఫికేషన్ చెల్లుబాటు కాదని న్యాయ చెబుతున్నారు. ఆరునెలల గడువు ముగిసేలోపు అసాధారణ రీతిలో శాసనసభను సమావేశపరిచి ఆర్డినెన్స్పై ఆమోద ముద్ర వేయించుకోవచ్చు. కానీ మండలిలో మాత్రం బిల్లు గట్టెక్కె పరిస్థితి లేదు. దీంతో స్థానిక ఎన్నికలు రద్దయినట్టేనని.. నిపుణులు చెబుతున్నారు.
సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే...
ఒకే అంశంపై మరో ఆర్డినెన్స్ చెల్లదని డీసీ వాద్వా వర్సెస్ బిహార్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ఆర్డినెన్స్-1983 అసెంబ్లీలో ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వం తిరిగి ఆర్డినెన్స్ జారీ చేసింది. వాద్వా.. మరికొందరు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై కోర్టు 1986 డిసెంబరు 20న తీర్పు ఇస్తూ.. ఆర్డినెన్స్ను అత్యవసర సమయాల్లో మాత్రమే జారీ చేయాలని తెలిపింది. అంతేకాదు ఇది చట్టసభలకు ప్రత్యామ్నాయం కాదని.. చట్టసభలలో చర్చించకుండా, వాటి ఆమోదం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దాకా చట్టాల అమలు కుదరని స్పష్టం చేసింది.
Recommended Video
రాష్ట్రపతి కూడా జారీచేయలే...
1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రపతి ఒకే అంశంపై రెండోసారి ఆర్డినెన్స్లు జారీ చేసిన సందర్భాలు లేవని గుర్తు చేసింది. దీనినిబట్టి పంచాయతీరాజ్ ఎన్నికల సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండో ఆర్డినెన్స్ కూడా చెల్లదు. దీనిపై కోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేదు. మొదటి ఆర్డినెన్స్కు కాలం చెల్లబోతోంది. రెండోది చెల్లనందున స్థానిక ఎన్నికల ప్రక్రియ రద్దయినట్లే అని రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. మరీ దీనిపై ఎస్ఈసీ ఏ నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి.