ఏపీ హీట్: లోకల్ బాడీ ఎన్నికలను మొత్తానికే రద్దు చేసి, తిరిగి నిర్వహించాలి: శైలజానాథ్, రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అగ్గిరాజేసింది. కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నామని ఈసీ ప్రకటించగా.. అధికార వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈసీపై సీఎం జగన్, ఇతర నేతల కామెంట్లను విపక్షాలు ఖండించాయి. స్వయం ప్రతిపత్తి గల సంస్థపై ఆరోపణలు తగవని మండిపడ్డాయి. ఒకడుగు ముందుకేసిన కాంగ్రెస్, సీపీఐ.. మొత్తం ఎన్నికల ప్రక్రియ మొదటినుంచి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. పరిస్థితి సద్దుమణిగిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సూచించాయి.
రద్దు చేయాలి..?
స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తానికి రద్దు చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ కోరారు. కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో ఆరువారాలపాటు ఎన్నికలను ఎస్ఈసీ రమేశ్ కుమార్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏకగ్రీవమైన స్థానాలు కొనసాగుతాయని.. నామినేషన్లలో కూడా మార్పులేదని, కేవలం ఎన్నికలను మాత్రమే పరిస్థితి సద్దుమణిగిన తర్వాత నిర్వహిస్తామని తెలిపారు. అలా కాకుండా మొత్తం ఎన్నికలను రద్దుచేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏకగ్రీవమైన స్థానాలపై తమకు అనుమానాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. తిరిగి నామినేషన్ల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరారు.
ఈసీని రద్దు చేయాలా..?
ఎస్ఈసీ రమేశ్ కుమార్పై సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీపీఐ రామకృష్ణ ఖండించారు. ఈసీపై జగన్ చేసిన వ్యాఖ్యలు చూసి విస్తుపోయానని పేర్కొన్నారు. ఓ రాజకీయ నేతపై చేసినట్టు వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఒకవేళ సీఎం జగన్కు అధికారం ఉంటే ఈసీని కూడా రద్దు చేయాలని కోరతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వాయిదా కాకుండా.. మొత్తానికే రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. తిరిగి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.
Recommended Video
ఆరు వారాలు వాయిదా..
కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ఆదివారం ప్రకటించారు. పరిస్థితి సద్దుమణిగిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఎస్ఈసీ రమేశ్ ప్రకటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంటికాలిపై లేచారు. ఏపీలో వైరస్ ప్రభావం లేదని, కావాలని ఎన్నికలను వాయిదా వేయడం సరికాదన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. ఈసీ రమేశ్పై సీఎం జగన్ కామెంట్లను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఖండించారు. వైరస్ ప్రభావం గురించి తెలియకుండా.. గుడ్డిగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా అని ప్రశ్నించారు.