ఉన్నత స్థానాల్లో ఉన్న వారే లక్ష్యంగా : 15 రోజుల్లో లోకాయుక్తకు 448 ఫిర్యాదులు: ప్రభుత్వం విస్మయం..!
ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ భాధ్యతలు చేపట్టిన తరువాత అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రకటించారు. పాలనా పరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో కొన్ని వివాదాస్పదంగానూ మారాయి. అయితే...ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకాయుక్తకు వరదలా వస్తున్న ఫిర్యాదులతో అసలు ఏం జరుగుతుందనే ప్రశ్న మొదలైంది. అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం, అసమర్థత వలన కలుగు సమస్యలపై పౌరులు ఫిర్యాదు చేయవచ్చును. వీటిని ప్రజల సమస్యలుగా భావించి లోకాయుక్త పరిష్కరిస్తుంది.
ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలోని అత్యున్నత వ్యక్తులపై వచ్చిన అవినీతి అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి గల సంస్థ లోకాయుక్త కావటంతో ఈ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో అధికారికంగా లోకాయుక్తకు 448 ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు ఈ సంఖ్య చూసిన తరువాత అసలు ఏపీలో ఏం జరుగుతోంది..ఎక్కడ లోపం ఉంది..ఈ ఫిర్యాదులు ఎవరి పైన వచ్చాయనే చర్చ ప్రభుత్వంలో మొదలైంది. ప్రభుత్వం సైతం ఈ సంఖ్య చూసి విస్మయం వ్యక్తం చేస్తోంది.
15 రోజులు 448 ఫిర్యాదులు..
పాలనా పరంగా అవినీతి నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అదే సమయంలో సుపరిపాలన లక్ష్యంగా కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం లోకాయుక్త చట్టానికి సవరణలు చేసి మరీ కొత్తగా లోకాయుక్తను నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. గత నెల సెప్టెంబర్ 15వ తేదీన ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆ రోజు నుండి సెప్టెంబర్ 30 వరకు అంటే మొత్తంగా కేవలం 15 రోజుల కాల వ్యవధిలోనే 448 ఫిర్యాదులను స్వీకరించింది.
అందులో 50 ఫిర్యాదులను తిరస్కరించగా, 215 ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు చేరవేయగా, 183 ఫిర్యాదులకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో తీసుకొని సంబంధిత శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మార్గదర్శకత్వం చేసారు.లోకాయుక్తకు వచ్చే ఫిర్యాదులు సహజంగానే తీవ్ర ఆరోపణలు ఉన్నవే ఎక్కువగా ఉంటాయి. దీంతో..ఇప్పుడు ఈ ఫిర్యాదులు ఎక్కువగా ఎవరి మీద వస్తున్నాయి..ప్రభుత్వంలో ఏ స్థాయి వారి మీద ఈ ఫిర్యాదులు వచ్చయనే చర్చ మొదలైంది.
ఉన్నత స్థానాల్లో ఉన్న వారిపైనేనా..
లోకాయుక్త చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలోని అత్యున్నత వ్యక్తులపై వచ్చిన అవినీతి అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి ఏర్పడింది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కార్యకలాపాలు, ప్రభుత్వ అధికార దుర్వినియోగం లాంటి అంశాలను గవర్నర్ ఆదేశాల మేరకు లోకాయుక్త విచారణ చేస్తుంది. లోకాయుక్తకు అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం, అసమర్థత వలన కలుగు సమస్యలపై పౌరులు ఫిర్యాదు చేయవచ్చును.
వీటిని ప్రజల సమస్యలుగా భావించి లోకాయుక్త పరిష్కరిస్తుంది. అయితే..ప్రారంభించిన తొలి 15 రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఫిర్యాదులు రావటం ద్వారా ప్రభుత్వం సైతం విస్మయానికి గురవుతోంది. లోకాయుక్తకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగంగా ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలోని అత్యున్నత వ్యక్తులపై వచ్చిన ఫిర్యాదులుగా తెలుస్తోంది. అయితే విచారణ వ్యవహారాలను సంస్థ గోప్యంగా నిర్వహిస్తోంది. ఇందు కోసం అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వ విచారణ సంస్థల సహాయం తీసుకుంటోంది.
రహస్య విచారణ..శాసనసభకు నివేదిక
లోకాయుక్త తమ వద్దకు వచ్చిన ఫిర్యాదుల పైన రహస్య విచారణ ప్రారంభించింది. అందులో కీలక స్థానాల్లో ఉన్నవారి పైనా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఫిర్యాదు దారుడి వివరాలు మాత్రం ప్రాధమిక స్థాయిలో రహస్యంగానే ఉంచుతారు. లోకాయుక్త ఫిర్యాదులను విచారించి, నివేదికను తయారు చేసి, నిందితుడు పని చేసే శాఖాధికారికి తగిన సిఫారసులు చేస్తుంది.
అలాగే ప్రతి సంవత్సరం లోకాయుక్త, ఉప లోకాయుక్తలు ఆ సంవత్సరం తీసుకున్న చర్యల గురించి గవర్నరు వార్షిక నివేదికను సమర్పిస్తారు. అలా అందుకున్న నివేదికలపై గవర్నరు తన వివరణల పత్రంతో రాష్ట్ర శాసనసభ ముందు ఉంచుతారు. దీంతో..ఇప్పుడు లోకాయుక్తకు వచ్చిన ఫిర్యాదులు..విచారణ పైన ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది.