అక్రమ బంధం నెపం: భార్యను మలేషియాలో వదిలేసి.. మరో యువతితో రెండో పెళ్లి..!
విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారంటే చాలు చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులు ఆ అబ్బాయికి తమ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుందని, ఏ కష్టం లేకుండా ఉంటుందని అనుకుంటారు. చాలా వరకు వాళ్లనుకున్నట్లే జరుగుతున్నప్పటికీ.. మరికొందరి విషయాల్లో మాత్రం తీరని వేదననే మిగులుస్తున్నాయి ఈ విదేశీ సంబంధాలు.
తాజాగా విజయవాడలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తమ కూతురు సుఖసంతోషాలతో ఉండాలని.. విదేశంలో పనిచేస్తున్న యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు. అయితే, వారు అనుకున్నదొకటైతే.. జరిగింది మరొకటి. ఆ అమ్మాయిని వేధింపులకు గురిచేసిన ఆ ప్రబుద్ధుడు.. ఆమెను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నంచడం గమనార్హం.
పెళ్లి తర్వాత మలేషియాకు..
ఆ వివరాల్లోకి వెళితే.. 2015 అక్టోబర్లో మలేషియాలో ఉద్యోగం చేస్తున్న మధు అనే వ్యక్తితో కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గానికి చెందిన అనూష అనే యువతికి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అనూషను మలేషియా తీసుకెళ్లాడు మధు. కొద్దిరోజులపాటు సవ్యంగానే ఉన్న మధు.. జల్సాలకు అలవాటుపడి అనూషను వేధించడం మొదలుపెట్టాడు.
జల్సాలకు అలవాటుపడి..
అంతేగాక, తన జల్సా తిరుగుళ్లకు అనూష అడ్డుతగులుతోందని భావించి.. ఆమెను ఎలాగైనా తొలగించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను మలేషియాలోనే వదిలేసి.. ఆమెకు చెప్పకుండానే స్వదేశానికి తిరిగొచ్చాడు ఈ ప్రబుద్ధుడు. ఆ తర్వాత అసలు విషయం తెలిసిన అనూష.. అత్తింటికి వచ్చి ఆందోళన చేసింది.
అక్రమసంబంధాలు అంటగడుతూ..
అయితే, అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామంటూ అత్తింటివారు తేల్చిచెప్పడంతో.. తిరిగి పుట్టింటికి వచ్చింది అనూష. ఇక ఎలాగైన అనూషను వదిలించుకోవాలనే ఆలోచనలో ఉన్న మధు.. ఆమెకు ఇతరులతో అక్రమ సంబంధాలున్నట్లు ఆధారాలు సృష్టించాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇతరులతో ఉన్నట్లు చిత్రీకరించాడు. ఈ నేపథ్యంలో ఇరుకుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
మరో అమ్మాయితో..
కాగా, ఇటీవలే మధు మరో అమ్మాయితో వివాహం కూడా చేసుకున్నాడు. ఈ విషయం తెలియడంతో మధుపై అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను రెండో పెళ్లి చేసుకోలేదని మధు బుకాయించాడు. అయితే, మధు తన రెండో భార్యతో కలిసి పెనుగంచిప్రోలులో ఓ ఆలయంలో పూజలు చేస్తుండగా అనూష బంధువులు చూసి ఫొటోలు తీసి అనూషకు చూపించారు. దీంతో మధు రెండో పెళ్లి బట్టబయలైంది.
అత్తింటివారి వాదన మరోలా..
మరో అమ్మాయితో రెండో పెళ్లి చేసుకున్న మధు.. జర్మనీ వెళ్లేందుకు వీసాలు కూడా సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ అనూష.. అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టింది. మధు రెండో పెళ్లి చేసుకోలేదని, తమ బంధువుల అమ్మాయితో గుడికెళితే పెళ్లి జరిగిందంటున్నారని మధు తల్లిదండ్రులు చెప్పుకురావడం గమనార్హం. తమ కుమారుడి జీవితం నాశనం చేస్తోందంటూ అనూషపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుకుటుంబాల నుంచి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.