2019 ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం:మధ్యాహ్న భోజన పధకం కార్మికుల హెచ్చరిక
విజయనగరం:మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న ఎపి మధ్యాహ్న భోజన పధకం కార్మికుల యూనియన్ మంగళవారం తమ నిరసనను కొనసాగించింది.
సోమవారం ఆందోళనలో పాల్గొన్న మధ్యాహ్న భోజన పధకం కార్మికుల అక్రమ అరెస్టులకు నిరసిస్తూ ఎపి మధ్యాహ్న భోజన పధకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్ వద్ద మంగళవారం రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి.సుధారాణి మాట్లాడుతూ 15 ఏళ్లుగా భోజన పథకం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మహిళలను కాదని ఈ పథకం నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అన్యాయమన్నారు.
మహిళలని చూడకుండా దాడి చేసి విశాఖపట్నంలో అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని, లేకపోతే 2019 ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఆమె హెచ్చరించారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించరాదని సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల ఆ పథకం కార్మికులు కలెక్టరేట్లు ముట్టడించిన సంగతి తెలిసిందే. కార్మికుల ఉపాధిని దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్న ఫ్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు ఒంగోలు కలెక్టరేట్ ఇన్గేట్ను ముట్టడించారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.
దీంతో పోలీసులు డిఇఓకు సమాచారం అందించారు. డిఇఓ కార్మికుల వద్దకు వచ్చి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో కార్మికులు ముట్టడిని విరమించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. నెల్లూరులో మధ్యాహ్న బోజన కార్మికులు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్లో జెసికి వినతిపత్రం అందచేశారు.
మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీకాంతంకు వినతిపత్రం అందజేశారు. కృష్ణాజిల్లా వీరులపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఖాళీ ప్లేట్లతో వినూత్న నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని వవినతిపత్రం అందజేశారు. విశాఖలో ఆందోళన చేస్తున్న మధ్యాహ్న భోజన పధకం కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.