పంచాయతీ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్: టీడీపీకి ఎండ్ కార్డ్ అంటూ మంత్రి సురేష్
అమరావతి: కుట్రలు, కుతంత్రాలతో ఏదోరకంగా విజయం సాధించాలని ప్రయత్నించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చతికిలపడ్డారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు తన ద్వారా లబ్ధి పొందినవారితో పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేసినా అరకొర స్థానాలకే పరిమితమయ్యారని అన్నారు.
చంద్రబాబు, టీడీపీ టైమ్ ముగిసింది..
ఇక తెలుగుదేశం పార్టీ సినిమా ముగిసిందన్నారు మంత్రి సురేష్. చంద్రబాబు టైమ్ అయిపోయిందన్నారు. టీడీపీ శ్రేణులే చంద్రబాబును నమ్మడం లేదన్నారు. సీఎం జగన్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఏర్పడిందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఇదే ప్రతిబింభించిందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు మతి చెల్లించింది.. అందుకే ఇలా..
మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్సార్సీపీని విమర్శించిన చంద్రబాబు.. రెండో ఫలితాలు వెలువడగానే ఎన్నికల కమిషన్ను విమర్శించారన్నారు. ఇప్పుడు నాలుగో విడత ఫలితాలు వెలువడగానే 50 శాతం తామే గెలిచామని చెప్పుకుంటున్నారని మంత్రి సురేష్ మండిపడ్డారు. ఒక్కో విడతలో ఒక్కో విధంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు మతి చెలించిందని విమర్శించారు. టీడీపీ శ్రేణులు ఆ పార్టీని వీడటం ఖాయమని వ్యాఖ్యానించారు.
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీసీదే హవా: సురేష్
ఈ ఎన్నికల్లో నెగ్గినట్లుగానే త్వరలో జరగనున్న పురపాలక, పరిషత్ ఎన్నికల్లోనూ వైయస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నారు. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపల్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తన పార్టీ గెలిస్తే ప్రజల మద్దతు తమకే ఉన్నట్లు.. వైయస్సార్సీపీ గెలిస్తే.. అక్రమాలు జరిగినట్లు చెప్పడం చంద్రబాబు నైజమని విమర్శించారు.
జగన్ బెస్ట్ సీఎం.. అక్రమాల సృష్టికర్త చంద్రబాబు..
అసలు ఎన్నికల్లో అక్రమాల సృష్టికర్త చంద్రబాబేనని అన్నారు. దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్న సీఎంలలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్న వైఎస్ జగన్ పాలనకు పంచాయతీ ఎన్నికలు దర్పణం పట్టాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో దాదాపు 90శాతం ఏడాదిన్నరలోపే నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. కాగా, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ సగానికిపైగా పంచాయతీలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నామమాత్రపు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది.