చంద్రబాబు పాదాలకు నమస్కారం: ఘనంగా అఖిలప్రియ వెడ్డింగ్ (ఫోటోలు)
హైదరాబాద్/ఆళ్లగడ్డ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ వివాహం ఘనంగా జరిగింది. బాజాభజంత్రీలు, వేదపండితుల మంత్రాల మధ్య ఆగస్ట్ 29న ఉదయం గం.10.57 నిమిషాలకు అఖిలప్రియ, భార్గవ రామ్ల వివాహం జరిగింది.
గవర్నర్, ఏపీ సీఎంల ఆశీర్వాదం
భూమా అఖిలప్రియ వెడ్డింగ్ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు పలువురు టీడీపీ నేతలు, ప్రముఖులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
చంద్రబాబు పాదాలకు నమస్కారం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాగానే అఖిలప్రియ దంపతులు ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వారికి పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఆ సమయంలో బంధువులకు చెందిన ఓ పాపను చంద్రబాబు ఎత్తుకున్నారు. అనంతరం అఖిల, భార్గవ రామ్తో కాసేపు మాట్లాడారు.
ఆళ్లగడ్డ ప్రజల మధ్య
రిసెప్షన్కు ముందు, పెళ్లి తర్వాత అఖిలప్రియ దంపతులు గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో నిన్న పెళ్లి ఘనంగా జరిగిందని, ఇందుకు సంతోషంగా ఉందన్నారు. ఆళ్లగడ్డ జనాల మధ్య పెళ్లి చేసుకున్నానని, తల్లిదండ్రులు లేని లోటు ఆ భగవంతుడు ఆళ్లగడ్డ జనాలతో తీర్చారని అభిప్రాయపడ్డారు.
శ్రీవారిని దర్శించుకుంటాం
తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నమ్మేవారని, తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తమ ఇంట్లో నడుచుకుంటూ తిరుమల రావడం అలవాటు అన్నారు. ఈ రోజు తన తల్లిదండ్రులు లేని లోటు ఎవరూ తీర్చలేనిది కానీ, ఆ శ్రీవారి ఆశీస్సులతో తమ పెళ్లి జరిగిందని, ఇందుకు సంతోషంగా ఉందని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులు రాష్ట్రానికి, ప్రజలకు ఉండాలన్నారు.
అఖిలప్రియ వివాహానికి హాజరుకాలేకపోయారు
అఖిలప్రియ వివాహానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖలకు ఆహ్వానం అందింది. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబుతో పాటూ మంత్రులు కూడా హాజరుకావాల్సి ఉండె. కానీ నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో విషాదం అలముకొంది. టీడీపీ నేతలు, నందమూరి అభిమానులు, వీఐపీలు తమ షెడ్యూల్ మార్చుకొని అక్కడకు వెళ్లారు. దీంతో అఖిలప్రియ వివాహానికి సీఎంతో పాటూ మంత్రులు, ముఖ్య నేతలెవరు హాజరుకాలేకపోయారు.
అఖిలప్రియ భర్త ప్రముఖ పారిశ్రామికవేత్త
మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ రామ్ ప్రముఖ పారిశ్రామికవేత్త. రాయలసీమలో ఆయనకు విద్యాసంస్థలు ఉన్నాయి. అఖిలప్రియ, భార్గవ్లు కొంతకాలంగా ప్రేమించుకొన్నారు. ఇప్పుడు వివాహం చేసుకున్నారు.