కరోనా భయంతో మంత్రి, స్పీకర్ కార్యాలయాల మూసివేత...ఏపీలో కొత్తగా 1555 పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏపీలో కరోనా కల్లోలం నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టు మూతపడింది. అత్యవసర కేసుల్లో మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలిస్తుంది. మరోపక్క ఏపీ సెక్రటేరియట్ లోనూ కరోనా కలకలం సృష్టించింది. అంతేకాదుఏకంగా ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ నమోదు కావడం రాష్ట్రంలో కరోనా పెరుగుతున్న తీరుకు నిదర్శనం.
క్యాంపు కార్యాలయాల మూసివేత నిర్ణయం
ఈ నేపథ్యంలోనే ఏపీలోని అధికార పార్టీ నేతలను సైతం కరోనా భయం వెంటాడుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న తీరు, అధికార పార్టీ నేతలు కరోనా వైరస్ బారిన పడుతున్న తీరు,మరో పక్క తెలంగాణ రాష్ట్రంలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బాధితులుగా మారడం వెరసి ఏపీలో మంత్రులు కరోనా కట్టడి కోసం సీరియస్ గా నిర్ణయం తీసుకుంటున్నారు . నేటి నుండి క్యాంపు కార్యాలయం మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తో పాటుగా, ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిర్ణయం తీసుకున్నారు.
15 రోజుల వరకు ఎవరూ రావద్దని విజ్ఞప్తి
కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం,ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ లు తన క్యాంపు కార్యాలయాలు మూసివేస్తున్నట్లు, గురువారం నుండి తనను కలవడానికి ఎవరు రావద్దని ప్రకటన విడుదల చేశారు. పదిహేను రోజుల వరకు క్యాంపు కార్యాలయాలకు ఎవరూ రావద్దని, కరోనా నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా క్యాంపుకార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
గత 24గంటల్లో 1555 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా కేసులు విషయానికి వస్తే దారుణంగా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా గత 24గంటల్లో 1555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో కరోనాతో 13 మంది మృతి చెందగా మొత్తంగా ఇప్పటివరకు 277 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందినవారు 1500 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 53 మంది, విదేశాల నుంచి వచ్చినవారిలో ఇద్దరు ఉన్నారు.
ఏపీలో మొత్తం 21,071 పాజిటివ్ కేసులు
ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 21,071 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.వివిధ ఆస్పత్రులలో 10,544 చికిత్స పొందుతున్నారు. 10,250 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు. రోజురోజుకు ఏపీలో కేసులు పెరుగుతున్న తీరు అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారిక వర్గాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.