మంత్రి అనిల్ కుమార్కు కరోనా టెస్టులు... స్వీయ నిర్బంధం, రిపోర్టులో ఏం తేలింది..?
కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. బయటకు వచ్చామా ఈ వైరస్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 300కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కూడా సీరియస్గా ఆంక్షలు తీసుకొచ్చింది. ఇక తెలంగాణలో అయితే ఇప్పటికే 11 మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోగా ఇక్కడ కూడా 300 మందికి పైగానే కరోనా పాజిటివ్గా తేలింది. ఇక ప్రజాప్రతినిధులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. వారికి అనుమానం రావడంతో ముందస్తుగానే కరోనాపరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా కరోనావైరస్ పరీక్షలు చేయించుకున్నారు.
నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నెల్లూరు జిల్లా వాసి కావడం విశేషం. ఇదిలా ఉంటే నెల్లూరుకు చెందిన ఓ పేరు గాంచిన డాక్టర్కు కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది. అంతకుముందు ఆయన తన హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్ కుమార్ను ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు అనిల్ కుమార్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఆ డాక్టరుకు కరోనా పాజిటివ్ ఉందని ఈ నెల 5వ తేదీన నిర్థారణ కావడంతో మంత్రి అనిల్ కుమార్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కరోనావైరస్ టెస్టులు చేయించుకున్నారు. అంతేకాదు మూడు రోజుల పాటు ఇంటికే పరిమితమై స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
Recommended Video
ఇక మంత్రి అనిల్ కుమార్ స్వాబ్ శాంపిల్ తీసి స్విమ్స్కు పంపించారు. ఆ రిపోర్టు సోమవారం సాయంత్రం వచ్చింది. అందులో మంత్రి అనిల్కు నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు ఇక మూడు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్న మంత్రి అనిల్ కుమార్ ఇక కరోనావైరస్ కార్యక్రమాలపై తిరగాలని డిసైడ్ అయ్యారు. ప్రజల్లో అవగాహన తీసుకురావాలని నిర్ణయించుకుని ఈ రోజు ఇంటి నుంచి బయటకు అడుగుపెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు కరోనావైరస్ టెస్టులు చేయించుకున్నారు. ఈ విపత్కర సమయాల్లో బయట ఉండి పనిచేయాల్సి రావడంతో ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు కరోనా వైరస్ టెస్టులు చేయించుకుంటున్నారు.