టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా - చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్- పవన్ కన్ఫ్జూజన్ మాస్టర్..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఓవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై రోజుకో సవాలుతో ఒత్తిడి పెంచుతోంది. రాజధాని రైతుల కోసం పోరాటానికి సిద్దమవుతున్న టీడీపీని రెచ్చగొట్టి రాజీనామాల దిశగా నడిపించాలని భావిస్తున్న వైసీపీ మంత్రులు.. ఇప్పటికే రెండు రోజులుగా సవాళ్లు విసురుతున్నారు. తాజాగా ఇవాళ కూడా మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇదే డిమాండ్ ను ప్రతిపక్ష టీడీపీ ముందుంచారు.
అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం జగనన్ చూస్తుంటే చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్ధం కావడం లేదని అనిల్ యాదవ్ అన్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉంటే అసమానతలు వస్తాయని, అయినా అమరావతి రాజధానిగా కొనసాగుతూనే మరో రెండు రాజధానులు వస్తున్నాయని అనిల్ తెలిపారు.
ప్రస్తుతం రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు చేసే పరిస్ధితి లేదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని అనిల్ వెల్లడించారు. చంద్రబాబు రాష్ట్ర విభజన సమయంలో సైతం ఇంత రాద్ధాంతం చేయలేదన్నారు. కానీ ఇప్పుడు మాత్రం తన బినామీలకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు నష్టం వస్తుందనే గగ్గోలు పెడుతున్నారని అనిల్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం తప్పంటున్న చంద్రబాబు.. తన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలని, అప్పుడు మూడు రాజధానులు తప్పని తాము ఒప్పుకుంటామన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కన్ఫ్యూజన్ లో ఉంటాడని, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదని అనిల్ వ్యాఖ్యానించారు. పవన్ గురించి మాట్లాడటమే అనవసరమన్నారు. ఓసారి బీజేపీ అంటాడని, మరోసారి టీడీపీ అంటాడన్నారు. బీటెక్ రవి రాజీనామా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఆయన స్ఫూర్తితో టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఫలితం ఉంటుందని అనిల్ తెలిపారు.