ఉమ అంటే ఆడా? మగా? పిలిచి కొత్తబట్టలు పెడతాం: దేవినేనిపై మంత్రి అనిల్ ధ్వజం
Recommended Video
ఏపీ వరదాయిని పోలవరం ప్రాజెక్టుపై మళ్లీ రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరాయి. ''ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తానని ఉత్తరకుమారుడిలా ప్రగల్భాలు పలికిన మంత్రి అనిల్ ఎక్కడున్నాడు?''అంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ చేసిన విమర్శలకు మంత్రి అనిల్ ఘాటుగా బదులిచ్చారు.
సొంత జిల్లా నెల్లూరులో బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. పోలవరం ప్రాజెక్టులపై టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తన 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏనాడూ ప్రాజెక్టులు కట్టలేదని, టీడీపీ నేతలకు దమ్ముంటే ఈ విషయంపై చర్చకు రావాలని సవాలు విసిరారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత ఒక్క వైఎస్సార్ కే చెందుతుందని, అదే బాటలో ఇప్పుడు సీఎం జగన్ నడుస్తున్నారని మంత్రి అనిల్ చెప్పారు.
''నన్ను ఉత్తరకుమారుడితో పోల్చుతూ టీడీపీ నేత ఉమ విమర్శలు చేశారు. ఇక్కడ నాకో విషయం అర్థంకాలేదు. ఉమ అంటే ఆడా? మగా? ఏది ఏమైనా 2021నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి, ఆ ఉమను కూడా పిలిచి కొత్త బట్టలు పెడతాం. అప్పటిదాకా తప్పుడు కూతలు మానుకుంటే మంచిది. ఉమ రాజకీయాల్లోకి ఎలా వచ్చారో, ఉత్తరకుమారులు ఎవరో, నిజంగా చదువుకున్నది ఎవరో కూడా ప్రజలకు అన్నీ తెలుసు''అని మంత్రి అనిల్ అన్నారు.
అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన లేఖపై మీడియాతో మాట్లాడిన సందర్భంలో టీడీపీ నేత ఉమ.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాను ప్రస్తావిస్తూ పోలవరం ప్రాజెక్టు, మంత్రి అనిల్ కుమార్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ విధానం వల్ల నదుల్లో నీళ్లు కూడా రివర్స్ అయిపోతున్నాయని ఉమ ఎద్దేవా చేశారు.