జగన్ ను కూడా లెక్క చేయని మంత్రి ? మాజీ బాస్ను అడ్డుకునేందుకు తప్పని ఎదురీత ..!
ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన తర్వాత మంత్రులకు సీఎం జగన్ రాబోయే రెండున్నరేళ్ల పాటు ఎలా మసలుకోవాలో క్లారిటీ ఇచ్చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే నిర్ద్యాక్షిణ్యంగా కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదనే హెచ్చరికలూ చేశారు. అలాగే పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య హద్దులనూ నిర్దేశించారు. అయినా విధేయతలే ప్రామాణికంగా ఉండే ప్రాంతీయ పార్టీలో ఉన్నామన్న సంగతిని మర్చిపోయి కొందరు నేతలు హద్దులు మీరుతున్న ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం విధేయత మీరుతున్న నేతల విషయంలో సమయం కోసం వేచి చూస్తున్నారు.
ఏపీలో పంచాయితీ రాజ్ చట్టంపై జగన్ సర్కార్ మరో ఆర్డినెన్స్ ... రీజన్ ఇదే !!
జగన్ కే అడ్డంకులు...
వైసీపీ సర్కారు మూడు రాజధానుల ప్రకటనతో తమ భవిష్యత్ రాజకీయ క్షేత్రంగా విశాఖను ఎంచుకున్నట్లు చెప్పకనే చెప్పింది. అంతే కాదు విశాఖలో అడుగుపెట్టకముందే అక్కడి రాజకీయాలను తమకు అనువుగా మార్చుకునేందుకు నిరంతరం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే ఉంది. ఇందుకోసం సొంత పార్టీ నేతల సమర్దత సరిపోదని భావిస్తున్న అధిష్టానం.. అవసరమైతే విపక్ష పార్టీల నుంచి వ్యూహాత్మకంగా నేతలను అరువు తెచ్చుకునేందుకూ సిద్దమవుతోంది. ఈ ప్రయత్నంలో విపక్ష పార్టీల నుంచి అభ్యంతరాలు, విమర్శలు ఎదురవ్వడం సహజమే అయినా సొంత పార్టీ నుంచే నేతలు అడ్డుపుల్లలు వేస్తుండటం అధినేత జగన్కు మింగుడు పడటం లేదు.
గంటా చేరికకు అవంతి అడ్డుపుల్లలు..
ఒకప్పటి తన రాజకీయ గురువు, గత టీడీపీ ప్రభుత్వం వరకూ కలిసే ఉన్న గంటా శ్రీనివాస్ తో చివరి నిమిషంలో విభేదించి వైసీపీలోకి వచ్చిన అవంతి శ్రీనివాస్ అనూహ్యంగా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పలు సమీకరణాల్లో మంత్రి కూడా అయ్యారు. అంతవరకూ బాగానే ఉన్నా విశాఖలో మారుతున్న రాజకీయాల్లో తన మాజీ గురువు గంటా రాకను వైసీపీ అధినేత, సీఎం జగన్ స్వాగతిస్తున్న తరుణంలో అవంతి శ్రీనివాస్ తన ఆక్రో్శాన్ని ఆపుకోలేకపోతున్నారు. ఇప్పటివరకూ విశాఖలో తనకు అనుకూలంగా ఉన్న పరిస్ధితులు గంటా రాకతో తలకిందులు కావడం ఖాయమని అవంతి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెరపైకి భూకుంభకోణాలు....
విశాఖలో భీమిలి కేంద్రంగా సాగిన భూముల కుంభకోణం గత టీడీపీ హయాంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. గతంలో టీడీపీ మంత్రులే ఈ దందాకు కారణమని తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ అదికారంలోకి వచ్చాక మాత్రం దీనిపై నోరెత్తడం లేదు. అయితే ఈ భూముల దందాకు ప్రధాన సూత్రధారిగా ఎప్పటి నుంచో ఆరోపణలు ఎదుర్కొంటున్న గంటా ఇప్పుడు వైసీపీలోకి వస్తున్న నేపథ్యంలో తిరిగి ఆ వ్యవహారాన్ని అవంతి తెరపైకి తెస్తున్నారు. గతంలో తన గురువు గంటాతో కలిసి ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న అవంతి ఇప్పుడు తనకేం తెలియదన్నట్లుగా ఇప్పుడు గంటాను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తీవ్ర ఆరోపణలు ఉన్న వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారన్న ప్రశ్నను అవంతి లేవనెత్తుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఏం జరిగిందో అంతా తెలిసిన విశాఖ జనం మాత్రం తాజా రాజకీయాలను నోరెళ్లబెట్టి చూస్తున్నారు.
జగన్ కే ఎదురెళ్తున్నారా ?
వాస్తవానికి వైసీపీయే కాదు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో అయినా అధినేతల నిర్ణయమే ఫైనల్. అది మంచైనా చెడయినా, అధినేతల మాటే చెల్లుబాటు అవుతుంటుంది. అధినేతలు ఓ నిర్ణయం తీసుకున్నాక వాటిని శిరసావహించడం మినహా ఎదురుచెప్పడం సాధారణంగా కనిపించదు. మారు మాట్లాడితే ఏమవుతుందో రఘురామరాజు ఉదంతం నిరూపిస్తూనే ఉంది. అయినా గంటా శ్రీనివాస్ వైసీపీలోకి వచ్చేందుకు అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసి తర్వాత కూడా ఆయనకు వ్యతిరేకంగా అవంతి శ్రీనివాస్ ఆరోపణలకు దిగడం ఏ సంకేతాలు ఇస్తోందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకుని, గెలిచాక మంత్రి పదవి కూడా కట్టబెట్టిన జగన్ కు ఎదురెళ్లడం ద్వారా విశాఖ రాజకీయాల్లో అవంతి సత్తా చాటుకుంటారా అంటే అనుమానమే. మరి అన్నీ తెలిసి కూడా గంటా రాకను వ్యతిరేకిస్తూ ఇందులో ఎంపీ సాయిరెడ్డిని కూడా లాగడం ద్వారా అవంతి ఎదురుదాడికి ఎందుకు సిద్దమవుతున్నారన్న చర్చ సర్వత్రా సాగుతోంది. అయితే అవంతి అభ్యంతరాలను జగన్ లెక్కచేసే పరిస్ధితి ఉండబోదనే వాదనే వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.