వైయస్సార్ మరణించాక ఇక తిరుగులేదనుకొని: వైసీపీలో చేరుతానంటే: చంద్రబాబుపై అవంతి..!
ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన మంత్రి అవంతి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేసారు. వైయస్సార్ ఉన్నంత వరకు చంద్రబాబు ఒక రకంగా..ఆయన మరణం తరువాత మరొక రకంగా వ్యవహరించారని అవంతి శాసనసభలో విశ్లేషించారు. వైయస్సార్ మరణం తరువాత ఇక తనకు తిరుగులేదనే భావనలో ఆయన వ్యవహారం గమనించామని చెప్పుకొచ్చారు. సభలో మీడియాపైన ఆంక్షల అంశం పైన అధికార..ప్రతిపక్షం మధ్య వాగ్వాదం సాగుతున్న సమయంలో మంత్రి అవంతి జోక్యం చేసుకున్నారు. మీడియా స్వేచ్చ గురించి చంద్రబాబు మాటలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హోదాలో మీడియా సమావేశంలో సాక్షి ప్రతినిధి ఏదైనా ప్రశ్నిస్తే..చులకనగా మాట్లాడేవారని గుర్తు చేసారు. ప్రత్యేక హోదా గురించి అసలు చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదని అవంతి విమర్శించారు.
ప్రత్యేక హోదా కోసం తాను వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన సమయంలోనే తాను రాజీనామా చేద్దామని ప్రతిపాదించానని..అందుకు చంద్రబాబు అంగీకరించలేదన్నారు. విశాఖలో హోదా కోసం ధర్నా చేస్తానని అడిగితే.. చేస్తే పార్టీ నుండి తొలిగించి ఉప ఎన్నికకు వెళ్తానని హెచ్చరించారని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో అమరావతిలో చంద్రబాబు పర్యటనకు వెళ్తే అక్కడ రాళ్లు..చెప్పులు పడ్డాయనే విషయం మీడియాలో చూసానని..అది చూడగానే..తనకు వైస్రాయ్ హోటల్ లో వెన్నుపోటు ఎపిసోడ్ లో ఎన్టీఆర్ అక్కడకు వచ్చిన సందర్బంలో ఆయన మీద టీడీపీ నేతలు రాళ్లు..చెప్పులతో దాడి చేసిన ఘటన గుర్తుకు వచ్చిందన్నారు. దేవుడుని తాను నమ్ముతానని..ప్రతీ ఒక్కరికి చేసిన పాపం పోదని వ్యాఖ్యానించారు. అదే విధంగా వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపుల ద్వారా తీసుకోగా.. ఇప్పుడు టీడీపీకి అదే 23 మంది ఎమ్మెల్యేలు మిగిలారని ఎద్దేవా చేసారు.
ఇక, తాను టీడీపీ వీడి వైసిపిలోకి వెళ్తానని చెప్పిన సందర్భంలో జరిగిన సంభాషణను సైతం అవంతి సభలో వివరించారు. తాను వైసీపీలోకి వెళ్తానని..అక్కడ మంత్రి అవుతానని చంద్రబాబుకు పార్టీ మారే ముందు చెప్పానన్నారు. దీనికి స్పందనగా..నువ్వ గెలుస్తావు కానీ..వైసీపీ గెలవదని చంద్రబాబు చెప్పారన్నారు. అయితే, తాను చెప్పిన విధంగానే వైసీపీలోనే గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిని అయ్యానని చంద్రబాబు గుర్తించాలని సూచించారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని..చంద్రబాబు తన గౌరవం తగ్గించుకొనే విధంగా వ్యవహరించవద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. ఆయన వైసీపీని సభలో రెచ్చగొట్టి వారితో మాట్లాడించి..సానుభూతి పొందాలని చూస్తున్నారని..అది సాధ్యం కాదని అవంతి స్పష్టం చేసారు.