ఈనాడుపై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి, రామోజీ రావుకు సవాల్
విశాఖ: ఈనాడు దిన పత్రిక పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు గురువారం ఉదయం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన విశాఖలో మాట్లాడారు. అదే సమయంలో ఈనాడు దినపత్రిక రామోజీ రావుకు సవాల్ విసిరారు.
మీడియాలో కథనాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను సంతకాలు చేసిన అన్ని ఫైళ్లను బయటపెడతానని, తప్పుడు ఫైల్పై సంతకం చేసినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. తన ప్రతిష్టను దిగజార్చేలా వార్తలు రాయొద్దని కోరారు.
పాడేరు ఏజెన్సీలో రూ.45 కోట్ల గోల్ మాల్ అయినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని, అది అవాస్తవమని ఆయన అన్నారు. పదకొండు నెలల కాలంలో తమ శాఖకు చెందిన ఫైళ్లను అన్నింటిని తమ పేరున రాసిన పత్రిక ముందు పెడతామని, దానిని వారు నిరూపించగలరా అని ప్రశ్నించారు.
పత్రిక వైఖరి మీడియా ప్రతిష్టను దిగజార్చేలా ఉందన్నారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనను అణగదొక్కేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు జరగకున్నా, జరిగాయని వార్తలు ప్రసారం చేసి తన ప్రతిష్టను దిగజార్చవద్దన్నారు.