హరీష్రావ్కు మంత్రి బాలినేని కౌంటర్- టీఆర్ఎస్లా ప్లేటు మార్చం - 4వేల కోట్లు ప్రజలకే..
రైతులకు ఉచిత విద్యుత్ మీటర్లు అమలు చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ మంత్రి హరీష్రావు తాజాగా కొన్ని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారు నాలుగు వేల కోట్ల కోసం కక్కుర్తి పడి రైతుల మెడకు ఉరితాడు బిగించేందుకు సిద్ధమైందంటూ ఫైర్ అయ్యారు. కేంద్రం సంస్కరణలను అమలు చేసే విషయంలో జగన్ అత్యుత్సాహం ప్రదర్శించారని హరీష్ వ్యాఖ్యానించారు.
హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చామన్నారు. కేంద్రం ఇచ్చే నాలుగువేల కోట్లు ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తామే తప్ప జేబుల్లో వేసుబోమనే విషయాన్ని హరీష్రావు గ్రహించాలన్నారు. రైతుల ఉచిత విద్యుత్ విషయంలో రాజీ పడబోమన్నారు. మరో 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో మాట తప్పబోమని రైతులకు హామీ ఇస్తున్నట్లు బాలినేని తెలిపారు.
కేంద్రంతో సంబంధాల విషయంలో టీఆర్ఎస్ తీరుపై బాలినేని మండిపడ్డారు. కేంద్రంతో ఓ రోజు మంచిగా ఉండటం, మరో రోజు గొడవ పడటం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక సఖ్యత అవసరమని భావిస్తున్నట్లు బాలినేని తెలిపారు. ఉచిత విద్యుత్ విషయంలోనూ డిస్కంలకు చెల్లించాల్సిన బిల్లులను నేరుగా రైతుల అకౌంట్లలోకే వేస్తామన్నారు. దీనిపై ఎవరూ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో ఉచిత విద్యుత్ మీటర్లపై విపక్షాల ఆరోపణల నేపథ్యంలో బాలినేని మరోసారి వారితో పాటు హరీష్రావుకూ ఒకేసారి కౌంటర్ ఇచ్చినట్లయింది.